Saturday, May 11, 2024

నర్సంపేటలో ఖాళీ అవుతున్న ప్రతిపక్షం

- Advertisement -
- Advertisement -
  • బిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్, ఇతర పార్టీల 200 కుటుంబాలు
  • గులాబీకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు కనుమరుగైపోతున్నాయని.. వరుసగా బీఆర్‌ఎస్ గూటికి వలస వెళ్తున్నారని, సీఎం కేసీఆర్ సర్కారుతో అభివృద్ధి సాధ్యమనేది నానుడిగా మారిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేట మండలంలోని మహేశ్వరంలో కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన 200 కుటుంబాలు ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బీఆర్‌ఎస్ చేరగా వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్‌ఎస నియమాలకు కట్టుబడి, విధేయత, నమ్మకంతో అటు పార్టీకి, ఇటు ప్రజలకు సేవ చేయాలన్నారు. కార్యకర్తలు పార్టీకి వెన్నెముక లాంటి వారని, నమ్మి బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ప్రతీ ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. ప్రతిపక్ష పార్టీలు చౌకబారు విమర్శలు, చిల్లర మాటలు మానుకోవాలన్నారు. రెచ్చగొట్టే మాటలతో ప్రజలకు ఒరిగేదేమి లేదన్నారు. గత నాలుగేళ్లుగా నేను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి ప్రజల ముందు ఉంచాను. నర్సంపేట ప్రజల చిరకాల వాంచ రామప్ప రంగాయచెరువు, రామప్ప పాకాల ప్రాజెక్టులతో నీళ్లు తేవడం కళ్లుముందున్న సాక్షమన్నారు.

కరోనా కష్ట కాలంలో ఐసోలేషన్ సెంటర్ పెట్టి గ్రామాల్లో వైద్య సేవలు నిరంతరం పర్యవేక్షించి ప్రాణాలు కపాడినప్పుడు ప్రతిపక్షాలు ఎక్కడున్నాయన్నారు. ప్రతీ గ్రామానికి 100 శాతం సీసీ రోడ్లు వేయడం జరిగిందని, మండలాన్ని గ్రామాలను కలుపుతూ మారుమూల తండాలకు బీటీ రోడ్లు వేయడం జరిగిందన్నారు. 100 పడకల ఆసుపత్రి ఉన్న చోట 600 పడకల జిల్లా ఆసుపత్రిని తీసుకరావడం, అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు తీసుకొచ్చామన్నారు.

రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఉద్యాన వన పంటల పరిశోధనా కేంద్రాన్ని తీసుకరావడం జరిగిందన్నారు. రైతు నష్టపోతే గతంలో దిక్కులేకున్నా సీఎం కేసీఆర్‌ను రప్పించి ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారాన్ని అందించామన్నారు. టీ డయాగ్నస్టిక్ సెంటర్, ప్రతీ గ్రామంలో పల్లె దావఖానాలు నిర్మించామన్నారు. రైతులు నష్టపోయారని వాళ్ల కోసం రూ. 75 కోట్లతో రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా సబ్సిడీతో రైతులకు పరికరాలు తేవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో వెలివేయబడ్డ నర్సంపేట ప్రజల బతుకులు మారాయన్నారు.

10 ఏళ్లు నిద్రపోయిన ప్రతిపక్షాలకు అభివృద్ధి గురించి ఏం తెలుసన్నారు. 10 ఏళ్లు పత్తా లేకుండాపోయి ఎన్నికలు అనగానే ప్రజల్లో ఉండి అభివృద్ధి జరగలేదని దుర్భాషలాడటం సబబు కాదన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ఎంపీపీ కళావతి, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, పిన్నింటి దేవేందర్‌రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు, వార్డుసభ్యులు, క్లస్టర్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News