Saturday, April 27, 2024

స్వరాష్టంలో చెరువులు మండు వేసవిలో నిండుకుండలను తలపిస్తున్నాయి

- Advertisement -
- Advertisement -
  • మంత్రి చామకూర మల్లారెడ్డి

కీసరః స్వరాష్టంలో చెరువులు మండు వేసవిలో నిండు కుండలను తలపిస్తున్నాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం చీర్యాల్‌లో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డితో కలిసి చీర్యాల్ చెరువు వద్ద గంగపూజ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎంఎల్‌ఎన్ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యదక్షత, దూరదృష్టితో తెలంగాణ సాగు నీటి రంగంలో సాధించిన విజయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే కలలు నేడు సాకారం అవుతున్నాయని చెప్పారు. స్వరాష్ట్రంలో అన్నపూర్ణగా మారిన తెలంగాణ దేశానికి అన్నం పెడుతుందని మంత్రి అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా 46,500 చెరువులను పూడిక తీసి పునరుద్ద్ధరించిందని తెలిపారు. దీంతో చెరువుల నీటి నిల్వ సామర్ధం, చేపల పెంపకం, ఆయకట్టు సాగు గణనీయంగా పెరిగిందని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో 2014కు ముందు 36 వేల టన్నులుగా ఉన్న పంట దిగుబడి నేడు 70 వేల టన్నులకు పెరిగిందని మంత్రి తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన అభివృద్ధి ఫలాలు నేడు కళ్లముందు కనిపిస్తున్నాయని, ఆయకట్టు సాగు సామర్ధం పెరిగి పంటలు సస్యశ్యామలంగా మారాయని అన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేష్, ఎంపిపి మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ, డిసిఎంఎస్ వైస్ మధుకర్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ఇఇ జితేందర్‌రెడ్డి, భూగర్భ జల వనరుల శాఖ అధికారి రేవతి, నీటి పారుదల శాఖ ఏఈ ప్రశాంత్, తహసీల్దార్ గౌరివత్సల, ఎంపిడిఒ లక్ష్మీవత్సలదేవి, సర్పంచులు తుంగ ధర్మేందర్, ఎన్.మాధురి, ఎ.మహేందర్‌రెడ్డి, కె.గోపాల్‌రెడ్డి, పి.పెంటయ్య, పి.రాజు, ఎంపిటిసిలు టి.నారాయణశర్మ, పి.కవిత, జె.వెంకటేష్, ఎం.కిరణ్‌జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

రాంపల్లిదాయరలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి

రాంపల్లిదాయర గ్రామంలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనం, సిమెంట్ రోడ్డులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జి.ఆండాలు మల్లేష్, ఉప సర్పంచ్ జి.రాము, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షులు జె. సుధాకర్‌రెడ్డి, నాయకులు కె.శ్రీకాంత్‌రెడ్డి, కె.వెంకట్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News