Monday, April 29, 2024

బిజెపిలో చేరాలని బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తనను బిజెపిలో చేరాలని ఆ పార్టీ బలవంతం చేసిందని ఆమ్ ఆద్మీపార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆప్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు దిగిందని, సామదాన భేద దండోపాయాలతో తన కు కూడా ఆహ్వానాలు పంపిస్తోందని ఆదివారం కేజ్రీవాల్ ఆరోపించారు. బిజెపి వేట, రాజకీయ చెలగాటాలు అడ్డు అదుపూ లేకుండా పోతున్నాయని మండిపడ్డారు. ఆప్ ఎమ్మెల్యేలు కొందరికి తలో పాతిక కోట్ల రూపాయలు అంతకు మిం చి బిజెపి ఆఫర్ చేసిందని కేజ్రీవాల్ ఆరోపించడం సంచలనాత్మకం అయింది. ఈ ఆరోపణకు సంబంధించి తగు సాక్షాధారాలు, సమాచారం ఉంటే తమకు అందించాలని, తగు వివరణ ఇచ్చుకోవాలని ఢిల్లీ పోలీసు క్రైంబ్రాంచ్ కేజ్రీవాల్‌కు, ఢిల్లీ మంత్రి అతిషికి నోటీసు వెలువరించింది. తగు సమాచారం ఇవ్వగలిగితే తగు విధంగా దర్యాప్తునకు వీలేర్పడుతుందని ఢిల్లీ పోలీసు విభాగం తెలిపింది. కేజ్రీవాల్ ఆరోపణలపై ఇప్పుడు ఢిల్లీకోర్టులో విచారణ సాగుతోంది. అయితే దీని గురించి పట్టించుకోకుండా కేజ్రీవాల్ ఆదివారం స్థానిక రోహిణి ప్రాంతంలో ఓ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ బిజెపిపై ఆరోపణలు తీవ్రతరం చేశారు. బిజెపి వారు అధికారం చేతిలో ఉంది కదా అని బెదిరింపులకు, బేరాలకు దిగుతున్నారు. బిజెపిలోకి వస్తే ఇబ్బందులు పెట్టబోమని హెచ్చరిస్తున్నారని, వారితో తాము చేతులు కలిపేది లేదని, తామేమీ నేరం చేశామని వారి నుంచి క్షమాభిక్షకు దిగాలని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం స్కూళ్లను, ఆసుపత్రులను, క్లినిక్‌లను, రోడ్లను మెరుగుపరుస్తోంది. ఇందులో తప్పేమీ లేదు కదా? అని ప్రశ్నించారు.
బిజెపి బెదిరింపులకు భయపడేది లేదు
బిజెపి తమపై తప్పుడు కేసులు పెడుతోంది. పైగా బిజెపి వైపు వస్తే ఎటువంటి వేధింపులు ఉండవని ఊరిస్తోంది. వారికి లొంగేది లేదు. వారి మోచేతి నీళ్లు తాగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏమైనా చేస్కోండి, మీ గూటికి వచ్చేది లేదని తాను బిజెపి మధ్యవర్తులకు తెలియచేసినట్లు కేజ్రీవాల్ వివరించారు. తనను ఎంతగా వేధించినా చివరికి జైలుకు పంపించినా తాము చేపట్టిన అభివృద్ధి పనులను ఎవ రూ ఆపలేరని కేజ్రీవాల్ సవాలు విసిరారు. ఢిల్లీలో పేదలకు సరైన విద్య కోసం స్కూళ్లు పెట్టినందుకు మనీష్ సిసోడియాను జైలుకు పంపించారు. గల్లీ ఆసుపత్రులను ఆరంభించినందుకు సత్యేంద్ర జైన్‌ను నిర్బంధించారని విమర్శించారు. ఆప్ నేతలను ఎంత మందిని ఇడి, సిబిఐల ద్వారా వేధించినా , తనను జైలుకు పంపించినా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆగబోవని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర బడ్జెట్‌లో స్కూళ్లకు 4 శాతమే
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో స్కూళ్లు , ఆసుపత్రులకు కేవలం 4 శాతమే కేటాయింపులు జరిగాయి. ఢిల్లీ ప్రభుత్వం 40 శాతం వరకూ స్కూళ్లు, ఆరోగ్య చికిత్సకు ఖరారు చేసిందని కేజ్రీవాల్ వివరించారు. ఆదివారం ఢిల్లీలో స్కూళ్లకు శంకుస్థాపన కార్యక్రమాలలో ఢిల్లీ విద్యా మంత్రి అతిశీ కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News