Sunday, May 5, 2024

నగరంలో ట్రాఫిక్ వదిలేశారు

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరోః హైదరాబాద్ నగరంలో గత రెండు, మూడు రోజుల నుంచి ఎక్కడ చూసినా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు పలు కూడళ్లలో విపరీతంగ ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కిలో మీటర్ల కొద్ది ట్రాఫిక్ జాం ఏర్పడుతున్నా కూడా ఎక్కడా ట్రాఫిక్ పోలీసులు కన్పించడంలేదు. దీంతో వాహనదారులు గంటల కొద్ది ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకం చూస్తున్నారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాలు, లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, బంజారాహిల్స్, సచివాలయం పరిసర ప్రాంతాలు, నెక్లెస్ రోడ్డు, ప్రజా భవన్, బేగంపేట్ ఏరియాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోతోంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లక్డీకాపూల్ మెట్రో స్టేషన్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతొంది. దీంతో వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడుతోంది.

మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తెలుగు తల్లి ఫ్లై ఓవర్, నెక్లెస్ రోడ్డు ఫ్లైఓవర్, ఖైరతాబాద్ జంక్షన్, తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 ఏరియాల్లో ట్రాఫిక్ కారణంగా కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఏరియాల్లో గత రెండు, మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి కనబడుతోంది. ట్రాఫిక్ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రయాణికులు పోలీసులను కోరుతున్నారు. ముఖ్యంగా అపోలో జంక్షన్ నుంచి బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వైపు వచ్చే వాహనదారులు సాయంత్రం సమయంలో నరకం చూస్తున్నారు. అపోలో జంక్షన్ వద్ద నుంచి క్యాన్సర్ ఆస్పత్రి వరకు వాహనాలను బానెట్ టు బానెట్‌గా ఉండడంతో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లాల్సిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఉంటున్నారు.

కన్పించని పోలీసులు
అపోలో జంక్షన్ నుంచి బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో రోడ్డులో ఇది వరకు ట్రాఫిక్ పోలీసులు జాం కాకుండా నిత్యం ఉండి వాహనాలను వెంటనే పంపించేవారు. కానీ బిఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి అక్కడ చూద్దామన్న ట్రాఫిక్ పోలీసులు కన్పించడంలేదు. ఒక వేళ ఉంటే కొందరు కానిస్టేబుళ్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటున్నారు. ఈ పరిసరాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఆర్‌ఎస్సై వాహనాలు ఆగుతున్నా కూడా పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారే వెళ్తారని వదిలేసి ఉంటున్నారు. గత మూడు రోజుల నుంచి అయితే అసలు ట్రాఫిక్ పోలీసులు కన్పించడంలేదు. దీంతో బిఆర్‌ఎస్ పార్టీ రెండు వైపులా ఉన్న రోడ్లు వాహనాల రద్దీతో నిండిపోయి ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. పార్టీ అధికారం కోల్పోయిందని పోలీసులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు భయం భక్తితో అక్కడ ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తించేవారని, ఇప్పుడు వదిలేశారని విమర్శిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News