హైదరాబాద్ : ఓ ట్రెయినీ పైలట్ బైక్పై 550 కి.మీ. ప్రయాణం చేసి హైదరాబాద్ శివార్లలో షాద్నగర్ సమీపంలోని చటాన్పల్లి బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురైన ఘటన ఆదివారం ఉదయం చోటుసుకుంది. వేగంగా డివైడర్ను ఢీకొట్టిన ఫైలట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువకుడు హైదరాబాద్లో నివాసం ఉంటూ పైలట్ శిక్షణ పొందుతున్నాడు. రెండు రోజుల కిందట పని నిమిత్తం స్వస్థలం మదనపల్లెకు వెళ్లాడు. లాక్డౌన్ నేపథ్యంలో రవాణా సౌకర్యాలన్నింటినీ రద్దు చేయడంతో 550 కి.మీ. దూరం బైక్పై ప్రయాణించి ఇల్లు చేరుకున్నాడు.
శనివారం సాయంత్రం తిరిగి నగరానికి తన బైక్పై బయలుదేరాడు. ఆదివారం రాత్రంతా చాలా దూరం బైక్పై ప్రయాణించడం, నిద్ర లేకపోవడంతో సదరు యువకుడు అలసటకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ నగర శివార్లకు చేరుకోగానే బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు షాద్నగర్ పోలీసులు తెలిపారు.