న్యూఢిల్లీ: బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై టిఆర్ఎస్ ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు వచ్చేలా కృషి చేయాలని వారు అరవింద్ కు సూచించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ఎంపి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రూ.50 వేల కోట్లు ఇస్తే తిరిగిచ్చేది రూ.23 వేల కోట్లేనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాలకు రావాల్సిన చాలా ఆదాయాల్లో కేంద్రం కోతలు పెట్టిందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు రూ. 290 కోట్ల మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. జిఎస్ టి, వెనకబడిన జిల్లాల రూ.9వేల కోట్లు నిధులు రావాలని రంజిత్ రెడ్డి సూచించారు. బిజెపి నేతలు అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పెద్దపల్లి ఎంపి వెంకటేశ్ నేత ఆరోపించారు. ఎంపి అరవింద్ సభ్యత, సంస్కారంతో మాట్లాడాలని హితవు పలికారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల చర్చ తర్వాతే రెవెన్యూ బిల్లు ఆమోదించామని ఆయన స్పష్టం చేశారు. వీగిపోతాయనే మూజువాణి ఓటుతో రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు ఆమోదించారని ఆయన పేర్కొన్నారు.