Monday, April 29, 2024

పల్లెల అభివృద్ధికి కెసిఆర్ ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

పూడూరు: తెలంగాణ పల్లెల అభివృద్ధ్దికి కేసిఆర్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని మీర్జాపూర్ గ్రామ పంచాయతీలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ సునితా మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిలతో కలిసి నూతన గ్రామ పంచాయతీ భవనం, సోలార్ లైటింగ్, పల్లె ప్రకృతి వనంలను మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 9 ఏళ్ల పాలనలో ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు. 2014కు ముందు తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకోవాలన్నారు. గతంలో 8 వేలు ఉన్న గ్రామ పంచాయతీలను ప్రస్తుతం 4 వేల పంచాయతీలుగా నూతనంగా ఏర్పాటు చేయడంతో 12 వేల గ్రామ పంచాయతీలుగా ఉన్నాయని, ఇది ముఖ్యమంత్రి కేసిఆర్ ఘనతేనని అన్నారు.

500 జనాభా ఉన్న తండాలను కూడా పంచాయతీగా మార్చారని గుర్తు చేశారు. అన్ని గ్రామాలకు నూతన పంచాయతీలను నియమించి సుపరిపాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. ఇందుకు గాను రూ, 85 కోట్ల నిధులు మంజూరు చేసి అనేక అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం మనదేనని అన్నారు. దీంతో సర్పంచ్‌లకు గౌరవం పెరిగిందన్నారు. ఇప్పటివరకు రూ. 65 వేల కోట్లు రైతుబంధు నిధులు రైతుల అకౌంట్లలో వేయడం జరిగిందన్నారు. భగీరథ ద్వారా ఇంటింటా తాగునీరును అందిస్తున్నామని చెప్పారు. పెన్షన్లు రెండు వేలకు, వికలాంగులకు 4 వేలకు పెంచి గొప్ప మానవాత వాదిగా ముఖ్యమంత్రి కేసిఆర్ నిలిచారన్నారు. మీర్జాపూర్ గ్రామానికి గతంలో రూ.63 లక్షలు వస్తే ప్రస్తుతం కోటి రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు.

9 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో 19 వేల ప్రకృతి వనాలు, 750 కోట్ల ఖర్చుతో నిర్మించామని అన్నా రు. హారితహారంలో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటడం జరిగిందని గుర్తు చేశారు. 7 వేల కోట్లతో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలకు సకల సౌకర్యాలను కల్పించామని అన్నారు. మీర్జాపూర్ అనుబంధ గ్రామానికి రోడ్డు వేయడానికి రూ. 30 లక్షల నిధులు మంజూరు చేశారు. పది వేల గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. చెరువులకు పూర్వ వైభవం తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మల్లేశం, జడ్‌పిటిసి మేఘమాల, గ్రామ సర్పంచ్, డిఆర్‌వో కృష్ణణ్, డిపిఓ తరుణ్‌కుమార్, జిల్లా మైనార్టీ వెల్ఫర్ అధికారి సుధారాణి, పూడూరు ఎంపిడిఓ ఉమాదేవి, ఎంపిటిసి సురేందర్, ఇంచార్జి సర్పంచ్ రవి, మాజీ ఏఎంసీ చైర్మన్ అజారోద్దీన్, మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మైపాల్‌రెడ్డి, ఏపిఎం, ఏపిఓ, ఆయా శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News