Friday, April 26, 2024

సడలింపు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

India is good result with complete lockdown on covid

రాష్ట్రంలో లాక్‌డౌన్ మరో10 రోజులు పొడిగింపు

ఉ.6 నుంచి సా.5గం. వరకు కార్యకలాపాలు
ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు

రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు

7 నియోజకవర్గాల్లో యథాతథంగా కఠినంగా లాక్‌డౌన్ అమలు
9 ఉమ్మడి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు
ఒక్కొక్కటి 250ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకు చర్యలు
ప్రభుత్వ దవాఖానాల స్థితిగతులు, మౌలిక సౌకర్యాల సమీక్ష
మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో సబ్ కమిటీ నియామకం
తమిళనాడు, కేరళతో పాటు శ్రీలంకలో అధ్యయనం
కాళేశ్వరం సహా సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు
భేష్, 3కోట్ల టన్నుల ధాన్యం దిగుబడిపై కేబినెట్ హర్షం
సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల ఆసుపత్రులు
ప్రతి జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్స్ సెంటర్లు, ఉచితంగా పరీక్షలు
మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మామోగ్రామ్ యంత్రాలు
తెలంగాణ హెల్త్ ప్రొఫైల్, ములుగు, సిరిషల్లలో పైలట్ ప్రాజెక్టు
వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో ఎయిమ్స్ తరహా దవాఖానా
– ఎనిమిదిన్నర గంటల పాటు ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన కేబినెట్ సుదీర్ఘ సమావేశంలో కీలక నిర్ణయాలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను గురువారం (జూన్ 10) నుంచి మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ సడలింపులు, అర్హులకు రేషన్ కార్డుల మంజూరు తదితర అంశాలపై చర్చించారు. గురువారం నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్‌డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. సాయంత్రం 6 గంటల నుంచి తిరిగి తెల్లారి ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది. కాగా.. కరోనా పూర్తిగా అదుపులోకిరాని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ నియోజక వర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యదాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. గత కేబినెట్ సమావేశం చేసిన ఆదేశాలమేరకు సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజక వర్గాల్లో కరోనా పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్ర వైద్యాధికారుల బృందం పర్యటించింది. ఈ నియోజకవర్గాల్లో కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, అందుచేత, ఈ ఏడు నియోజక వర్గాల్లో లాక్‌డౌన్‌ను ప్రస్థుతం కొనసాగిస్తున్న సమయాన్ని అ నుసరించే మరో పదిరోజుల పాటు కొనసాగించాలని కేబినెట్‌కు వైద్యాధికారుల బృందం సిఫారసు చేసింది. వారి సిఫారసుల మేరకు ఈ ఏడు నియోజకవర్గాల్లో లాక్‌డౌన్ యథాతథ స్థితినే (ఉదయం 6 గంటల నుం చి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు…. మరో గంటపాటు గమ్యస్థానాలకు చేరుకునేందుకు వెసులుబాటు) కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.
వానాకాలం సాగుకు పూర్తిస్థాయిలో సంసిద్ధం
వానాకాలం సాగుపై వ్యవసాయశాఖ సంసిద్ధత మీద క్యాబినెట్ లో పూర్తిస్థాయి సమీక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై క్యాబినెట్ హర్షం వ్యక్తం చేసింది. గత ఏడాది వానాకాలం, యాసంగి కలిపి 1,06,03,927 ఎకరాల్లో కేవలం వరి పంట సాగు చేయడం ద్వారా సుమారు 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి రావడం పట్ల కేబినెట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ కృషిలో భాగం పంచుకున్న వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని, అధికారులు, సిబ్బందిని క్యాబినెట్ అభినందించింది. 2,601 వ్యవసాయ క్లస్టర్లలో ఏ.ఈ.ఓలు రైతు వేదికలు కేంద్రంగా రైతులకు పూర్తిగా అందుబాటులో ఉంటూ వారికి పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందించాలని, వానాకాలం సాగుకోసం రైతులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని క్యాబినెట్ ఆదేశించింది. చేపలు, గొర్రెల పెంపకం వంటి రంగాల్లో అద్భుతమైన కృషిని కనబరుస్తున్న మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, అధికారులను, సిబ్బందిని క్యాబినెట్ అభినందించింది. ఈ యాసంగిలో ఇప్పటికే సుమారు 84 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరణ జరిగిందని, మిగిలిన కొద్దిపాటి ధాన్యం కొనుగోళ్లను కూడా వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు అనుమతి
హైదరాబాద్ జిల్లా మినహా పాత తొమ్మిది జిల్లాల్లో ‘తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టిఎస్‌ఎఫ్.పి.జెడ్) ఏర్పాటుకు క్యాబినెట్ అనుమతించింది. ఒక్కొక్కటి 250 ఎకరాలకు తగ్గకుండా రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.
మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన వైద్య ఆరోగ్య కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ప్రభుత్వ దవాఖానల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు సబ్ కమిటీని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ వైద్య ఆరోగ్య కేబినెట్ సబ్ కమిటీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షులుగా, మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, పి.సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు. వీరిని దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటుగా ఉత్తమమైన వైద్య ఆరోగ్య సేవలను అందిస్తున్న పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా వెళ్లి అధ్యయనం చేసిరావాలని, సమగ్ర నివేదికను అందించాలని కేబినెట్ ఆదేశించింది.
ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రారంభం
సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల దవాఖానలను నిర్మించాలని, ప్రస్థుతం ఉన్న దవాఖాన్లను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. సూర్యాపేటలో ప్రస్థుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో రోగుల సహాయార్ధం వచ్చే వారికోసం వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని వైద్యశాఖను ఆదేశించింది. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌ను ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. బుధవారం నుంచి ప్రారంభించబోతున్న 19 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలతో పాటుగా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ డిజిటల్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్, టుడీ ఈకో తోపాటుగా మహిళల కాన్సర్ స్క్రీనింగ్ కోసం ‘మామో గ్రామ్’ యంత్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఎలర్జీ జబ్బుల పరీక్షలు ట్రీట్‌మెంట్ కోసంగా ప్రత్యేక కేంద్రాలను హైద్రాబాద్ వరంగల్, సిద్దిపేటలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పెరుగుతున్న రోగుల రద్దీ రీత్యా ప్రస్థుతం రాష్ట్రంలోని డయాలసిస్ కేంద్రాలలో మరిన్ని డయాలసిస్ యంత్రాలను పెంచడంతో పాటు నూతనంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం. కేన్సర్ రోగులకు జిల్లా కేంద్రాల్లోనే కీమో థెరపీరేడియో థెరపీ కొరకు అవసరమైన మౌలిక వసతులతో జిల్లా కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అన్ని దవాఖానాల్లో అవసరాలను అందుకునే విధంగా బ్లడ్ బ్యాంకుల ఆధునీకరించి అవసరమైన మేరకు నూతన బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్యానికి సంబంధించి ఆర్థోపెడిక్, న్యూరాలజీ తదితర ప్రత్యేక విభాగాలలో, మెరుగైన వైద్య సేవలకోసం కావలసిన మౌలిక వసతులను కల్పించి, అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలని కేబినెట్ వైద్యశాఖను ఆదేశించింది.
వరంగల్ జైలు ప్రదేశంలో ఎయిమ్స్ తరహా దవఖానా
వరంగల్లులో ఖాళీ చేస్తున్న జైలు ప్రదేశంలో, దేశంలోనే అత్యుత్తమంగా వైద్యసేవలందిస్తున్న ఎయిమ్స్ తరహాలో దవఖానాను ఏర్పాటు చేసి అన్ని రకాల స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలందించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ఎండీ హాస్పిటల్ అడ్మిస్ట్రేషన్ కోర్సు అభ్యసించిన అర్హులైన వారిని నియమించుకుని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వినియోగించాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్య సేవల్లో భాగం పంచుకునే నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సులను, లాబ్ టెక్నీషియన్, రేడియాలజీ, టెక్నిషియన్, డయాలసిస్ టెక్నిషియన్ వంటి ప్రత్యేక నైపుణ్య కోర్సులను అవసరమైనంత మేరకు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యకళాశాలల్లో అందుబాటులోకి తేవాలని కేబినెట్ వైద్యశాఖను ఆదేశించింది.
మాతా శిశు సంరక్షణకు వైద్య సేవలను మరింతగా పటిష్టపరిచాలి
రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు సంబంధించిన వైద్య సేవలను మరింతగా పటిష్టపరిచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇతర రోగులతో కలపకుండా తల్లీ బిడ్డలకు ప్రత్యేకంగా వైద్యసేవలందించాలని, అందులో భాగంగా, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ప్రధాన దవఖాన భవనంలో కాకుండా ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మేరకు ప్రత్యేకంగా భవనాలను నిర్మించి వసతులు కల్పించాలని కేబినెట్ ఆదేశించింది. ఈ ప్రత్యేక భవనంలోనే హై రిస్క్ ప్రసవాలవసరమైన గర్భిణీల వైద్యసేవలం కోసం ప్రత్యేక ‘మెటర్నల్ ఐ సీ యూ’ లను, నవజాత శిశువుల కోసం ఎస్‌ఎన్‌సీయూలను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు వైద్యశాఖ అహర్నిషలు కృషి చేయాలని కెబినెట్ ఆదేశించింది. గర్భం దాల్చిన మూడో నెల నుంచి గర్భిణీలకు సమతుల పౌష్టికాహార కిట్టును అందించాలని నిర్ణయం. రెండో కరోనా వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరో థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని అవసరమైన మౌలిక వసతులను సిబ్బందిని ఔషదాలను సమకూర్చుకోవాలని కేబినెట్ ఆదేశించింది.
డిజిటల్ సర్వే
వ్యవసాయ భూముల సెటిల్ మెంట్ అనే వ్యవహారమే ఉత్పన్నం కాదని, ఇప్పటికే సమస్యలేవీ లేకుండా పరిష్కారమై న ప్రక్రియ అని, రాష్ట్ర ప్రభుత్వ అమల్లోకి తెచ్చిన నూతన ఆర్వోఆర్ చట్టం- 2020 ప్రకారం, రాష్ట్రంలోని 99 శాతం వ్యవసాయ భూములు ఎటువంటి సమస్యలు లేకుండా ఇప్పటికే ధరణిలో నమోదయినాయని కేబినెట్ కు రెవిన్యూ శాఖ వివరించింది. రైతుల కాస్తులో ఉన్న భూములకు, భౌతికంగా వుండే హద్దురాల్లు, కాయితాలమీద వుండే టీఫన్ నక్ష తో కూడిన కొలతలు ఇకనుంచి అదే లెక్కలతో అవే హద్దులు డిజిటల్ రూపంలోకి మారుతాయని, రాల్లు ఊడిపోయినా కొలతల కాయితాలు చినిగిపోయినా రైతుల పట్టా భూములకు ఇంచు తేడా రాకుండా డిజిటల్ మ్యాప్ ద్వారా రక్షణ లభిస్తుందని రెవిన్యూ శాఖ కేబినెట్ కు వివరించింది.ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయం భూములకు వాటి కొలతల ప్రకారం డిజిటల్ సర్వే చేపట్టి వాటికి అక్షాంశ రేఖాంశాలను (కో ఆర్డినేట్స్ ) ను నిర్దారించాలని, అందుకు సంబంధించి పాత ఉమ్మడి 9 జిల్లాల్లో జిల్లాకు 3 గ్రామాల చొప్పున 27 గ్రామాల్లో సర్వేను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.
పిఆర్‌సికి కేబినెట్ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ ( 9,21,037 మందికి) 30 శాతం పిఆర్‌సి ప్రకటిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెంచిన పిఆర్‌సి వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్ ను 1.7.2018 నుంచి., మానిటరీ బెనిఫిట్ ను 1.4.2020 నుంచి., క్యాష్ బెనిఫిట్ ను 1.4.2021 నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.పెన్షనర్లకు 01-.04-.2020 నుంచి 31.-5.-2021 వరకు చెల్లించాల్సిన ఏరియర్స్ (బకాయిలను) 36 వాయిదాల్లో చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. కెజిబివి కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని నిర్ణయించింది. హెచ్ ఆర్ ఏ మీద పరిమితిని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది.

 

TS Govt extends lockdown again 10 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News