కొత్త పట్టాదారులు 13వ తేదీలోపు ఎఇఒలకు సంబంధిత పత్రాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ సూచన
కోటి 50లక్షల ఎకరాలకు రైతుబంధు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని కోటి 50 లక్షల ఎకరాలకు ఈ వానాకాలం సీజన్లో రైతుబంధు ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు కొత్తగా డిజిటల్ సైన్ అయిన పట్టాదారుల ఆధార్, బ్యాంకు వివరాలను వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి వరకు కొత్తగా పాసు పుస్తకాలు పొంది, ఒక్కసారి కూడా రైతుబంధుకు చేసుకోని వారు ఉంటే ఈ నెల 13వ తేదీలోపు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఇందుకు దరఖాస్తు ఫారం, భూమి పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ లేదా ఎమ్ఆర్ఒ డిజిటల్ సంతకం అయిన పేపర్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు సేవింగ్స్ ఖాతా పాసు పుస్తకం జిరాక్స్ను సంబంధిత రైతులు ఎఇఒకు సమర్పించాలని పేర్కొన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతుబంధుకు బడ్జెట్లో ప్రభుత్వం రూ.14 వేల కోట్లు కేటాయించింది. ఈ వానాకాలం సీజన్కు రూ.7 వేల కోట్లు ఇవ్వనుంది. ఇందుకు ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇవ్వగా, రూ.3500 కోట్లు విడుదల చేసింది. త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు రూ.2 వేల కోట్లు ట్రెజరీ ఖాతాకు పంపినట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు మన తెలంగాణ కు తెలిపారు. ప్రతి సీజన్కు వ్యవసాయ శాఖకు రెవిన్యూ శాఖ సిసిఎల్ఎ నుంచి డిజిటల్ సైన్ అయిన వ్యవసాయ భూముల పట్టాదారుల వివరాలను అందిస్తుంది. దీని ఆధారంగా వ్యవసాయ శాఖ రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సొమ్మును జమ చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో వ్యవసాయ శాఖకు సిసిఎల్ఎ నుంచి భూ సమాచారం ఇచ్చింది. దీని ప్రకారం 59.30 లక్షల మంది రైతులకు గాను కోటి 47 లక్షల ఎకరాల భూమి ఉంది. అలాగే ప్రభుత్వం ఆర్ఒఎఫ్ఆర్ భూములకు కూడా రైతుబంధు అందిస్తుంది. దాదాపు 3 లక్షల మంది రైతులకు 92 వేల మంది రైతులతు ఉన్నారు. దీంతో మొత్తంగా 60.3 లక్షల మంది రైతులకు కోటి 50 లక్షల ఎకరాలకు పెట్టుబడి అందించనుంది. అయితే సిసిఎల్ఎ నుంచి మరోమారు డేటా సేకరించి, వ్యవసాయేతర రంగాలకు మళ్లీన భూమిని రైతుబంధు సాయం నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2018 నుంచి ఇలా…
2018 వానాకాలం సీజన్ నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. మొదటి రెండు సీజన్లలలో ఎకరాకు రూ.4 వేల చొప్పున చెల్లించారు. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.5 వేల చొప్పున సంవత్సరానికి రూ.10 వేలు అందిస్తామన్నారు. ఇచ్చిన హామీ మేరకు 2019 వానాకాలం నుంచి ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. 2018 వానాకాలంలో 50.25 లక్షల మంది రైతులకు కోటి 30 లక్షల ఎకరాలకు రూ.5236 కోట్లు, యాసంగిలో 49.13 లక్షల మంది రైతులకు కోటి 31 లక్షల ఎకరాలకు రూ.5251 కోట్లు ఇచ్చారు. 2019లో ఎకరాకు రూ.5 వేల చొప్పున వానాకాలంలో 51.61 లక్షల మంది రైతులకు కోటి 22 లక్షల ఎకరాలకు రూ.6125 కోట్లు, యాసంగిలో 42.42 లక్షల మంది రైతులకు 88.13 లక్షల ఎకరాలకు రూ.4406 కోట్లు బదిలీ చేశారు.
(సీజన్ల వారీగా పెట్టుబడి సాయం విస్తీర్ణం ఎకరాలలో, రైతుల సంఖ్య లక్షలలో, రైతుబంధు రూ. కోట్లలో)
సంవత్సరం విస్తీర్ణం రైతులు అందిన రైతుబంధు
2018 వానాకాలం 1.30 50.25 5236
2018 యాసంగి 1.31 49.13 5251
2019 వానాకాలం 1.22 51.61 6125
2019 యాసంగి 88.13 లక్షలు 42.42 4406