Monday, April 29, 2024

కిందకు దిగని కూరగాయల ధరలు

- Advertisement -
- Advertisement -

Vegetable prices are increasing

 

మనతెలంగాణ/హైదరాబాద్ : పచ్చిమిరప మరింత ఘాటెక్కింది. రాష్ట్రంలో గత మూడు వారాలుగా పచ్చి మిరప ధరలు పెరుగుతున్న ఎండలతో పోటీపడుతూ వస్తున్నాయి. రైతుబజార్లలో కిలో పచ్చిమిరప ధర రూ.80కి విక్రయిస్తుండగా కాలనీల్లో ,తోపుడు బండ్లపైన వీటి ధర రూ.100కు పెరిగిపోయింది. ఈ ఏడాది రాష్ట్రంలో 2.50లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిరప పంట సాగుచేశారు.ఇందులో అత్యధికశాతం ఎండు మిర్చికోసం ఇది వాణిజ్య పంటగానే సాగులోకి వచ్చింది. అయితే అకాల వర్షాలతో కొంతమేరకు పంట దెబ్బతినింది.అనూహ్యంగా వైరస్ తెగుళ్లు కూగా చుట్టుమట్టడంతో అధికశాతం విస్తీర్ణంలో మిరప పంటను చెడగొటి ఇతర పంటలు సాగు చేసుకున్నారు. పంటలు దెబ్బతిని నష్టపోయిన ఎండు మిరప రైతుల ప్రభావం కూరగాయల పంటగా సాగుచేసే పచ్చిమిరప విస్తీర్ణంపై కూడా పడింది. వైరస్ తెగుళ్లతో పంట దిగుబడి సరిగా రాకపోవచ్చన్న అభిప్రాయంతో రైతులు ఈ సీజన్‌లో పచ్చిమిరప పంట సాగును తగ్గించినట్టు చెబుతున్నారు.

పంట ఉత్పత్తి తగినంతగా రాకపోవటంతో వంటింటి అవసరాలకు పచ్చిమిరప చాలినంతగా అందుబాటులో ఉండటం లేదని ,అందుకే పచ్చిమిరపకు డిమాండ్ పెరుగుతూ వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు మరికొన్ని ఇతర కూరగాయల ధరలు కూడా తగ్గటం లేదు. కాకరకాయ ధరలు కూడా గత రెండు వారాలనుంచి కిలో రూ.50కు తగ్గటం లేదు. చిక్కుడు, గోకర , బీర ,బెండ కాయల ధరలు కిలో రూ.30కి తగ్గటం లేదు. నల్లవంకాయ రూ.15, పచ్చ పొడుగు వంకాయ రూ.18, క్యాబేజి రూ.15, క్యారెట్ రూ.28, దొండకాయ రూ.23, గుండు బీన్స్ రూ.28, కీర రూ.18, ఉల్లిగడ్డ రూ.22, చామగడ్డ రూ. రూ.35ఆలుగడ్డ రూ.22, సొరకాయ రూ.12, పొట్ల కాయ రూ.18 వంతున విక్రయిస్తున్నారు

టామాటా ధరలు నేలచూపులు

రాష్ట్రంలో టమాటా ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఇతర అన్ని రకాల కూరగాయల ధరలకంటే మార్కెట్‌లో టామాటా ధరలే కారుచౌకగా మారాయి. గత వారం రోజులుగా కిలో టామటా ధర రూ.10వద్దనే కొనసాగుతోంది. ఈ ఏడాది వర్షాకాల సీజన్‌లో సాగు చేసిన టామాటా పంట అకాల వర్షాలతో దెబ్బతినటంతో పంట దిగుబడి తగ్గి కిలో టామాటా గరిష్టంగా రూ.150కు పెరిగిపోయింది. ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటంతో రైతులు నవంబర్‌లో చలికాలపు పంటగా పెద్దమొత్తంలో టామాటా సాగు చేశారు. టామాటా దిగుబడులు గత రెండు వారాలుగా మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. దీంతో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రైతు బజార్లలో టామాటా కిలో రూ.8కే విక్రయిస్తుండగా , కాలనీల్లో , తోపుడు బండ్లపైన కిలో రూ.10కే విక్రయిస్తున్నారు.కొత్తిమిర, గోంగూర , తోటకూర, తదితర ఆకు కూరల ధరలు అందుబాటులో ఉన్నట్టు వినియోగదారుల చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News