Monday, April 29, 2024

కింగ్ మరో ఘనత..

- Advertisement -
- Advertisement -

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో పటిష్టస్థితికి చేరుకుంది. శుక్రవారం రెండో రోజు భోజన విరామ సమయానికి భారత్ 108 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి సెంచరీతో అలరించాడు. కీలకమైన మ్యాచ్‌లో శతకం సాధించి దీన్ని చిరస్మరణీయంగా మలుచుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి కోహ్లి రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. విండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న కోహ్లి శతకం సాధించాడు.

సమన్వయంతో బ్యాటింగ్ చేసిన కోహ్లి, జడేజాలు భారత్‌ను పటిష్టస్థితికి చేర్చారు. ఈ జోడీని విడగొట్టేందుకు విండీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 206 బంతుల్లో 11 ఫోర్లతో 121 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టెస్టుల్లో తన 29 సెంచరీని నమోదు చేశాడు. అంతేగాక జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 159 పరుగులు జోడించాడు. మరోవైపు జడేజా కూడా మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. విండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న జడేజా 152 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇక ఇషాన్ కిషన్ (18), రవిచంద్రన్ అశ్విన్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలావుంటే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 10 ఆధిక్యంలో నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News