జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మి (కన్నెపల్లి పంప్ హౌజ్) లో ఏకబిగిన 11 మోటార్లు రన్ అవుతున్నందున నీటి తరలింపు వేగవంతమైంది. దీంతో లక్ష్మి(మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) బ్యారేజీలలో జలకళ సంతరించుకున్నది. అన్ని మోటార్లు శుక్రవారం ఒకేసారి ఎత్తిపోస్తున్నందున 2 టిఎంసిల నీరు అన్నారం బ్యారేజీ వైపు ఉరకలు వేస్తున్నది. సిఎం కెసిఆర్ ఈ నెల 13న లక్ష్మి బ్యారేజీ సందర్శించి నీటి తీరును పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేయడంతో జల తరలింపు పనిలో వేగం పెరిగింది. అందుకుగాను ఈ నెల 15 నుంచి 18 వరకు నిరంతరాయంగా లక్ష్మి పంప్ హౌస్ మోటార్లు పనిచేయడంతో 6టిఎంసిల నీరు రికార్డు స్థాయిలో సరస్వతి బ్యారేజీకి చేరింది. ప్రస్తుతం 14 టిఎంసిల ప్రాణహిత నీటి నిల్వతో కాళేశ్వర సాగరం కళకళలాడుతున్నది. గోదావరిలో తగినంత నీరు లేనందున అధికారులు ప్రాణహితపై ఆధారపడ్డారు.