విద్యావంతులకు కొదవ లేని భాగ్యనగరంలో ఓట్ల కొరత
ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపని నగర ఓటర్లు
పడుతున్న ఓట్లలో చాలా వరకు పేదలు, మధ్యతరగతి ప్రజలే అధికం
గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో 45.27 శాతానికి మించిన పోలింగ్
కనీసం 70 శాతానికి పెంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం యత్నం
పలువురు సెలిబ్రిటీలతో ఓటు ప్రాధాన్యతపై విస్తృత ప్రచారం
సోషల్ మీడియా, రేడియో, టివిల్లో పెద్దఎత్తున ప్రకటనలు
నగరంలో భారీగా హోర్డింగ్లు
హైదరాబాద్ : ఈ సారైనా గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేనా? అన్న అనుమానాలు, సందేహాలు తలెత్తుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, బల్దియా అధికారులు తీవ్ర స్థాయి లో కృషి చేస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం పెరగడం లేదు. భాగ్యనగరంలో విద్యావంతులకు కొదవలేదు. ఓటు ప్రాధాన్యత కూడా తెలుసు. అయినప్పటికీ పోలింగ్ రోజున మాత్రం ఓటు వేయడాని కి ముందుకు రావడం లేదు. దీంతో జిహెచ్ఎంసి ఎన్నిక ల్లో 40 నుంచి 45 శాతానికి పెరగడమే గగణంగా మారుతోంది. ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి ఓటింగ్ శాతం పెంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘంతో బల్దియా అధికారు లు చేయని ప్రయత్నాలు అంటూ లేవు. అయినా గ్రేటర్ పోలింగ్ పరిస్థితిలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు.
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ కార్పొరేషన్గా రూపాంతరం చెందిన తరువాత మొదటి సారిగా 2009 సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఓటిం గ్ శాతం 41.22 శాతం కాగా, 2016లో జరిగిన ఎన్నిక ల్లో 45.27శాతం మాత్రమే. గ్రేటర్లో 150 డివిజన్లు, 74 లక్షలకుపైగా ఓటర్లు ఉన్నప్పటికీ ఓటు వినియోగించుకుంటున్న వారి సంఖ్య కనీసం సగం కూడా ఉండడం లేదు. దీంతో ఈ సారైనా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు సంబంధిత అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ హీరోలు నాగార్జున, విజయ్దేవర కొండ, డైరెక్టర్లు శంకర్, శేఖర్ కమ్ముల, ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్తేజ, టివి యాంకర్లు సుమ, ఝాన్సీలతో ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ పెద్దఎత్తున వీడియోలను విడుదల చేశారు. ఇందులో ఓటు ప్రాధాన్యత, మన నగరం అభివృద్ధికి మన వంతు సహకారం అందించాలంటే ప్రతి ఒక్కరు ఓటు వేయాలని వివరించారు. ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.
ఓటు వేయనప్పుడు సమస్యలపై రాజకీయ నాయకులను నిలదీసే అవకాశాన్ని కోల్పోతామని వీడియాల్లో పేర్కొన్నారు. పోలింగ్ ఒక్క రోజున ఒక అరగంట సమయాన్ని కేటాయించి ఓటు వేస్తే, తిరిగి ఐదేళ్ల వరకు మనం ఎన్నుకున్న నేతలను తిట్టుకునే అవకాశముండదన్నారు. రాష్ట్రానికి రాజధాని అయిన హైదరాబాద్లోనే ఓటింగ్ శాతం తగ్గుతుండడం అందరిని కలవరపెడుతోందన్నారు. అందుకే ‘మనమూ ఓటేద్దాం… మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులతో కూడా ఓటు వేసే విధంగా కృషి చేద్దామని’ వారు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలో అన్ని ప్రచార మాధ్యమాలలో జోరుగా వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే మరింత ఉధృతంగా ప్రచా రం సాగుతోంది. ఇక ఓటు వేయడానికి అవసరమైన ఓట ర్ స్లిప్లు కూడా ఇప్పటికే ఇంటింటికి అందజేయడంతో పాటు డౌన్లోడ్కు ప్రత్యేక యాప్ను సైతం రూపొందించింది. మై జిహెచ్ఎంసి యాప్లో నో యువర్ ఓట్ ఆప్షన్లో పేరు, వార్డు నెంబర్ ఎంటర్ చేస్తే ఓటరు స్లిప్, పోలింగ్ లోకేషన్కు సంబంధించి గూగుల్ మ్యాప్ కూడా వచ్చేలా తయారు చేశారు. అంతేకాకుండా నో- యువర్ ఓట్పై ఎఫ్ఎం రేడియో, టివి స్క్రోలింగ్, బస్షెల్టర్స్పై హోర్టింగ్లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ప్రప్రథమంగా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రదర్శించడంతో పాటు ఓటర్ చైతన్యంపై భారీగా హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసికి చెందిన 1500 సెల్ పోన్ రింగ్టోన్ల ద్వారా కూడా ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకునేలా చైతన్యం కల్పించారు.