గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్: భారతదేశంలో మహిళలు ఎంటర్ప్రైన్యూర్షిప్లో మరింతగా చొరవచూపి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. మహిళల భాగస్వామ్యంతోనే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. దేశంలో మొత్తం పారిశ్రామికవేత్తలతో మహిళలు కేవలం 20 శాతం లోపు ఉండడం ఆందోళన కలిగించే అంశమన్నారు. భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సిఎస్ఐఆర్ నీరి (సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ నేషనల్ ఎన్వీరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)ల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సమావేశంలో భారత మహిళ ఎంటర్ ప్రెన్యూర్స్ సైంటిస్ట్ల కాంక్లేవ్గా నిర్వహించారు. ‘ఆత్మనిర్భర్లో మహిళల పాత్ర అన్న’ అంశంపై తమిళిసై మాట్లాడుతూ మహిళలకు మరిన్ని ప్రోత్సాహాకాలు ఫండింగ్, వసతుల కల్పన ద్వారా వారిని ఎంటర్ ప్రెన్యూర్స్గా ప్రోత్సహించాలన్నారు. భారతదేశంలో దాదాపు 70 శాతం మంది మహిళలు ఆదాయం వచ్చే పనులకు దూరంగా ఉన్నారు. వీరంతా ఆర్థికపరమైన వర్క్ ఫోర్స్గా మారితే దేశం దాదాపు 30 శాతం ఆర్థికంగా బలోపేతమవుతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. మహిళలు ఔత్సాహికులుగా ఎదిగితే వారి కోసం అనేక ఉద్యోగాల కల్పన చేసి వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడుతారన్నారు.
మహిళల్లో మరింత ఎక్కువమంది సైంటిస్ట్లు కావాలి
బాలికల్లో చిన్నప్పటి నుంచే సైన్స్, పరిశోధనల పట్ల ఆసక్తి కలిగించే సైంటిస్ట్లుగా ఎదిగేందుకు ప్రోత్సహించాలన్నారు. వారు కేవలం 14 శాతం మందే ఉండడం సైన్స్, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో భారత్ ఎదుగుదలకు మంచిది కాదన్నారు. మహిళల్లో మరింత ఎక్కువ సైంటిస్ట్లు తయారుకావాలన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా, సైంటిస్టులుగా మరింత ఎక్కువ సంఖ్యలో రావడం స్వయం సమృద్ధి, స్వయం ఆధారిత భారత్ లక్షసాధనలో అత్యంత కీలకమన్నారు. సమాజంలో వివక్ష తొలగాలి, కుటుంబ ప్రోత్సాహం, వనరుల కల్పన, సైన్స్ కోసం మహిళల కోసం మరిన్ని స్కాలర్షిప్లు, ప్రత్యేక కళాశాలలు ఈ దిశగా అవసరమని తమిళిసై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారత్లో మహిళా సైంటిస్ట్లు ఈ బుక్ను గవర్నర్ ఆవిష్కరించారు.