మఠాధిపతులతో భేటీలో యడియూరప్ప
సిఎం పదవిని వీడనున్నారన్న ఊహాగానాలకు ఊతం
బెంగళూర్: బిజెపి అధిష్ఠానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. పలు సామాజిక వర్గాలకు చెందిన మఠాధిపతుల బృందంతో సమావేశమైన సందర్భంగా యడియూరప్ప ఈ వ్యాఖ్యలు చేశారని ఆ వర్గాలు తెలిపాయి. దీంతో, ముఖ్యమంత్రి పదవిని వీడేందుకు యడియూరప్ప సిద్ధమైనట్టుగా వచ్చిన ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఈ అంశంపై తాను ఇంతకన్నా ఏమీ మాట్లాడలేనని యడియూరప్ప అన్నట్టు బాలేహోసూర్ మఠాధిపతి దింగలేశ్వర్స్వామి తెలిపారు. మఠాధిపతుల బృందానికి ఈయనే నేతృత్వం వహించారు. యడియూరప్పను తొలగిస్తే రానున్న రోజుల్లో బిజెపి చెడు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్వామి హెచ్చరించారు. యడియూరప్పను మార్చొద్దన్నది మఠాధిపతుల ఏకాభిప్రాయమని ఆయన తెలిపారు. మరో రెండురోజుల్లో 300 నుంచి 400 మంది వరకూ మఠాధిపతులు బెంగళూర్ లో సమావేశమై తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
25న అధికారులకు, 26న ఎంఎల్ఎలకు విందు
యడియూరప్ప తన ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, సచివాలయ సిబ్బందికి ఈ నెల 25న విందు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరుసటి రోజే(ఈ నెల 26న) బిజెపి శాసనసభాపక్షం సమావేశం ఉండటంతో యడియూరప్ప తన పదవికి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. అయితే, ఆయన అనుచరులు మాత్రం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా వార్తల్ని తిరస్కరిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయం(సిఎంఓ)లోని ఓ అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం కూడా శాసనసభాపక్షం సమావేశం తర్వాత యడియూరప్ప విధానసౌధలో బిజెపి ఎంఎల్ఎలకు విందు ఇవ్వనున్నారు. ఆ సందర్భంగా ఫోటో సెషన్ కూడా ఉంటుంది. ఇలాంటివి పదవి నుంచి దిగిపోయే సమయంలోనే ఏర్పాటు చేస్తారన్నది గమనార్హం.