Monday, April 29, 2024

280 మంది డాక్టర్లు 24 గంటల వైద్య సేవలు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నిర్మించడం వల్ల కార్మికుల పిల్లలు, పేద పిల్లలు ఈరోజు డాక్టర్లుగా తయారవుతున్నారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నూతనంగా నిర్మించిన 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను  రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు  ప్రారంభించారు. 175 సీట్లు సిద్దిపేట మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు పొందుతారని, ఇందులో 25% అంటే 25 సీట్లు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి చదువుతారని, ఢిల్లీ రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఏంటో అర్థం అవుతుందని ప్రశంసించారు.

గతంలో సిద్దిపేట మెడికల్ కాలేజ్ నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి పంపించేవారు కానీ ఇకపై నుండి ఇక్కడే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయని, నూతన క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇకనుండి క్యాన్సర్ చికిత్స కూడా ఇక్కడే అందించబడుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.

ఈ ఆస్పత్రిలో 40 పడకల డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశామని, 15 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందులో 8 మార్జిలర్ ఆపరేషన్ థియేటర్లు నిర్మించుకున్నామని, 100 ఐసియు బెడ్ లు పూర్తి సామర్ధ్యంతో సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రైవేట్ కి దీటుగా వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు.

30 పడకలతో ఎమర్జెన్సీ వార్డు ఉంటుందని, 23 కోట్లతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాకు ఏర్పాటు చేయబోతున్నామని, 875 మంది వైద్య విద్యార్థులు ఉంటారని హరీష్ రావు వివరించారు. 13 డిపార్ట్ మెంట్లలో పిజి కోర్సులు అందుబాటులో ఉన్నాయని, మరో 3 నూతన పిజి సీట్లు ఏర్పాటు చేశామని, ప్రతి ఏడాది 62 మంది పిజి విద్యార్థులకు కూడా చదివే అవకాశం ఉందన్నారు.

సంపన్నుల పిల్లలే డాక్టర్ చదువు చదవాలన్న నానుడిని మారుస్తూ రైతులు, కూలీల పిల్లలు కూడా ఎంబిబిఎస్ చేసే అవకాశం ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చారని కొనియాడారు. స్టాఫ్ నర్స్ ల పేరు మారుస్తూ నర్సింగ్ డాక్టర్ గా పిలుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సింగ్, బి ఫార్మసీ కాలేజ్ లు సిద్దిపేట లో ఉన్నాయని, 280 మంది డాక్టర్లు 24 గంటలు వైద్య సేవలు అందిస్తారని, వీరితోపాటు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేసుకున్న 150 మంది డాక్టర్లు కూడా సేవలు అందిస్తారని ప్రశంసించారు. ప్రాథమిక చికిత్స నుండి ప్రాణాంతక వ్యాధుల వరకు అన్ని వైద్య సేవలు అందించబడతాయని, ఒకప్పుడు మనం నీళ్లు చూడనోళ్లం..కానీ ఇప్పుడు కరువు కూడా తెలియడం లేదని హరీష్ రావు చెప్పారు. ఒక ప్రాంతానికి కావాలిసిన కలలను సాకారం చేసుకున్నామని, సిద్దిపేట జిల్లా చేసుకున్నామని, సిద్దిపేట కు గోదావరి నీళ్లు తెచ్చుకున్నామని, సిద్దిపేట కి రైల్ కూడా తెచ్చుకున్నామని ప్రశంసించారు. వేయి పడకల ఆస్పత్రి మనకు ఇచ్చిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట ప్రజలందరికీ శుభాకాంక్షలు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ రఘుతం రెడ్డి, సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, అడిషనల్ కలెక్టర్ గిరిమ అగర్వాల్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, సూపరింటెండెంట్, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News