Sunday, April 28, 2024

108 ‘సేవలు’ విస్తృతం

- Advertisement -
- Advertisement -

108 Ambulance services further expanded

తెలంగాణ ఏర్పడిన తర్వాత 108 అంబులెన్స్ సేవలను మరింత విస్తృతం చేశాం

వాహనాల సంఖ్యను 430కి పెంచుకున్నాం చెడిపోయిన వాటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవి చేర్చుకుంటున్నాం అన్ని సేవలు
ప్రజలకు ఏలోపం లేకుండా అందించడానికే సిఎం కెసిఆర్ కృషిచేస్తున్నారు : రెండు కొత్త 108లను ప్రారంభిస్తూ మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందేలా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అత్యవసర సమయంలో ఆస్పత్రులకు చేర్చే 108 అంబులెన్స్ సేవలను మరింత విస్తృతం చేసుకున్నామని, వాటి సంఖ్యను 430కి పెంచుకున్నామని పేర్కొన్నారు. కాలం చెల్లిన, పూర్తిగా చెడిపోయిన వాహనాలను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటూ సేవలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వెంగళ్‌రావు నగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు అంబులెన్స్‌లనును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, అంబులెన్స్‌లను సహకరించిన ఇండస్ ఇండ్ బ్యాంక్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు రెండు అంబులెన్స్‌లు ప్రారంభించుకున్నామని, మరో 8 ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారని అన్నారు.

సిఎస్‌ఆర్ కింద వీటిని సమకూర్చడం సంతోషకరమని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సగటున 15 నుంచి -20 నిమిషాల్లో అంబులెన్స్ సేవలందుతున్నాయని తెలిపారు. ఈ సమయాన్ని మరింత తగ్గించేందుకు లక్ష్యం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. తక్షణ వైద్యాన్ని అందించేలా ఈ అంబులెన్సుల్లో బేసిక్ లైఫ్ సపోర్టు వ్యవస్థ ఉందని అన్నారు. అత్యవసర వైద్యం అందించి ఆసుపత్రికి చేరేలోగా ప్రాణాలు కాపాడే అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్టు సిస్టమ్ కలిగిన అంబులెన్స్‌లు ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ 2021 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నాలుగున్నర లక్షల మందికి సేవలు అందించినట్లు చెప్పారు.

అందుబాటులోకి 50 బైక్ అంబులెన్స్‌లు

ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్‌పై ప్రజల్లో మరింత విశ్వాసం కలిగించేందుకు, అంబులెన్స్ వెళ్లలేని ప్రాంతాలకు సైతం వెళ్లి వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో 50 బైక్ అంబులెన్స్‌లను ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంత వాసుల కోసం ఐటీడీఏ పరిధిలో, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి పట్టణ పరిధిలో ఈ అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న 25 అంబులెన్సులు ప్రతి నెల సగటున 750 ఎమర్జెన్సీ కేసులకు సేవలందిస్తున్నాయని వివరించారు. ఏప్రిల్ 2021 నుంచి ఈ ఏడాది పిబ్రవరి వరకు దాదాపు 19వేల మందికి ఈ 50 బైక్ అంబులెన్స్‌లు సేవలందాయని మంత్రి గుర్తు చేశారు.

300 అమ్మ ఒడి వాహనాలు

మారుమూల పల్లెల నుండి గర్భిణులను ఆసుపత్రులకు, తిరిగి ఇంటికి చేర్చేందుకు 300 అమ్మ ఒడి వాహనాలను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి చెప్పారు. 2018 నుంచి ఇప్పటి వరకు 38 లక్షల మంది గర్బిణులు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఒడి వాహనాల ద్వారా సేవలు పొందారని పేర్కొన్నారు.

పార్థివదేహాలను తరలించేందకు పరమపద వాహనాలు

గతంలో ఎవరైనా దవాఖానల్లో మరణిస్తే.. ఆ పార్థీవ దేహాలను సొంతూళ్లకు తీసుకువెళ్లడం పెద్ద సమస్యగా ఉండేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు.ఈ కష్టాన్ని, వేదనను మనసుతో అర్థం చేసుకున్న ప్రభుత్వం.. పార్థీవ దేహాలను తరలించేందుకు 50 పరమపద వాహనాలను ఏర్పాటు చేసిందన్నారు. అవసాన దశలో ఉన్న వారికి వైద్య సేవలు అందించేందుకు గాను దీనికి అదనంగా 30 ఆలన వాహనాలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఇన్ని రకాల వాహనాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వాటి సేవలు నిర్విరామంగా, నిరాటంకంగా కొనసాగేలా అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News