సమర్థవంతంగా కొవిడ్ రోగుల టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్
రాష్ట్రవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కేసులు, కొత్తగా 1102 పాజిటివ్లు
జిల్లాల్లో 868, జిహెచ్ఎంసిలో 234
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఫలిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకే జిహెచ్ఎంసి పరిధిలో కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు. గత నెల రోజుల క్రిందట ప్రతి రోజూ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో 85 శాతం జిహెచ్ఎంసి పరిధిలోనే వచ్చేవి. కానీ ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఆ ఉధృతి తగ్గిపోయింది. గత వారం రోజులుగా జిహెచ్ఎంసి ప్రాంతంలో కేవలం ఐదువందల కంటే తక్కువగానే తేలుతున్నాయి. దీంతో ప్రజలతో పాటు అధికారులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు. ట్రిపుల్ టీ(టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్) విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేయడం వలనే ఇది సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, గత కొన్ని రోజుల క్రితం కేసులు పెరుగుతున్న కొద్ది ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న చికిత్స విధానాన్ని, అందుబాటులోకి వచ్చిన కొత్త తరహా మందులతో వైద్యం చేయడం వలనే రాష్ట్రంలో సత్ఫలితాలు వస్తున్నట్లు హెల్త్డైరెక్టర్ డా శ్రీనివాసరావు అంటున్నారు. ప్రతి వారం చికిత్స ప్రోటోకాల్పై జిహెచ్ఎంసితో పాటు అన్ని జిల్లాల వైద్యులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిపుణులచే అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఆరు నెలలుగా సిఎం, మంత్రి ఈటల రాజేందర్ సహకారంతో వైద్యశాఖ చేసిన కృషికి కాస్త ఫలితం వస్తుందని, రాబోయే రోజుల్లో కేసులు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు.
రాష్ట్రంలో మరో 1102 కేసులు….
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 20,054 టెస్టులు చేయగా, 1102 పాజిటివ్లు తేలాయి. మరో 1046 రిపోర్టులు ఫెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలో 234 ఉండగా, ఆదిలాబాద్లో 14 ,భద్రాద్రి 15, జగిత్యాల 11, జనగామ 16, భూపాలపల్లి 0, గద్వాల 17, కామారెడ్డి 33,కరీంనగర్ 101,ఖమ్మం 46, ఆసిఫాబాద్ 3,మహబూబ్నగర్ 37, మహబూబాబాద్ 21, మంచిర్యాల 9, మెదక్ 18, మేడ్చల్ మల్కాజ్గిరి 63, ములుగు 8, నాగర్కర్నూల్ 29, నల్గొండ 28,నారాయణపేట్ 4, నిజామాబాద్ 33, పెద్దపల్లి 22, సిరిసిల్లా 13, రంగారెడ్డి 81, సంగారెడ్డి 66,సిద్ధిపేట్ 30, సూర్యాపేట్ 13, వికారాబాద్ 8,వనపర్తి 19, వరంగల్ రూరల్ 25,వరంగల్ అర్బన్ లో 70, యాదాద్రిలో మరో 11మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో 9 మంది చనిపోయారు.
దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 91,361కి చేరగా.. డిశ్చార్జ్ల సంఖ్య 68,126కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 22,542మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 15,502 మంది హోం ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 693కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16 కేంద్రాల్లో ఆర్టిపిసిఆర్, 323 సెంటర్లలో టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్స్లో 5246 బెడ్లు, ప్రైవేట్లో 3577పరుపులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
రాష్ట్రంలో కరోనా వివరాలు…
ఇప్పటి వరకు చేసిన మొత్తం టెస్టులు సంఖ్య 7,44,555
నమోదైన కేసుల సంఖ్య 91,361
కోలుకున్న వారి సంఖ్య 68,126
యాక్టివ్ల సంఖ్య 22,542
హోం ఐసొలేషన్లో 15,502
కరోనా మరణాల సంఖ్య 693
కోవిడ్ రికవరీ రేట్ 74.56 శాతం
డెత్ రేట్ 0.75 శాతం
మరణించిన వారి సంఖ్య 693
కోవిడ్ కాల్ సెంటర్ నంబరు 104
ప్రైవేట్ ఆసుపత్రుల ఫిర్యాదుల నంబరు 9154170960
1102 New Corona Cases Registered in Telangana