Saturday, April 27, 2024

రాష్ట్రంలో 12 సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట :రాష్ట్రంలో 12 చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ సీఎంఎస్ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేట మెడికల్ కళాశాల ఆవరణలో ప్రభుత్వకేంద్రియ ఔషద గిడ్డంగి, 50పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాలకు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైన సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్ సోర్పింగ్ విధానంలో భర్తి చేస్తున్నామన్నారు. వీటి ఏర్పాటుతో రోగులకు వెంటనే మందులు అందుతాయన్నారు. ఇప్పటి వరకు సిద్దిపేటకు మందులు హైదరాబాద్ డ్రగ్స్ స్టోర్ నుంచి పంపిణి జరిగేవన్నారు. ఇక నుంచి సిద్దిపేటలోనే డ్రగ్స్ స్టోర్ అందుబాటులో ఉంటుందన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందించే మందుల సంఖ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిందన్నారు. ఇప్పటి వరకు 720 ఉన్న జాబితా 843కు పెంచిందన్నారు. ఈఎంఎల్‌లో 311, ఎంఎంఎల్ జాబితాలో 532 మందులు ఉన్నాయి. కొత్తగా 123 రకాల మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఆసుపత్రులలో పారిశుద్ద ప్రమాణాలు పెంచడం కోసం, పారిశుద్ద కార్మికులకు ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని నిర్ణయించిన మేరకు ప్రభుత్వం బెడ్ ఒక్కంటికి చేసి పారిశుద్ద ఖర్చును 5 వేల నుంచి 7500 పెంచిందన్నారు. ఇందు కోసం రూ. 338 కోట్లు ప్రతి యేటా వెచ్చించినట్లు తెలిపారు.

డైట్ చార్జీలు రెట్టింపు చేసినట్లు ,టీబీ క్యాన్సర్ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందిచేలా ఒక్కో డైట్‌కు డైట్ చార్జీలు రూ. 56 నుంచి 112 పెంచినట్లు తెలిపారు. సాదారణ రోగులకు ఇచ్చే డైట్ చార్జీలు బెడ్ ఒక్కంటికి రూ. 40 నుంచి 80 పెంచామన్నారు. సిద్దిపేటలో రూ. 15 కోట్లతో 50 పడకల ఆయూష్ ఆసుపత్రి శంకుస్ధాపన చేయడం సంతోషంగా ఉంది. ఆయూష్‌కు మంచి భవిష్యత్తు ఉంది. మారుతున్న కాల పరిస్ధితుల నేపధ్యంలో సంప్రదాయ వైద్యానికి రోజు రోజుకు ప్రాదాన్యత పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో 834 ఆయూష్ డిస్పెన్సరీలు ,5 కళాశాలలు, 4రీసెర్చ్ ఆసుపత్రులు ఉన్నాయి. వాటిలో అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నారన్నారు.

ఆయుర్వేదంలో పంచకర్మ విధానం ద్వారా వెన్నుముక,కీళ్ల సమస్యలు , పక్షవాతం, దీర్ఘకాలిక రోగ సమస్యలకు చికిత్సలు చేస్తున్నట్లు తెలిపారు. నార్మల్ డెలివరీలు పెంచేలా యోగ ఎంతో సహాయకరంగా ఉంటుందన్నారు.బీఆర్కే ఆర్ ఆయుర్వేద కళాశాల, వరంగల్ ఆయుర్వేద కళాశాల ద్వారా మంచి వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. సిద్దిపేటలో ఏర్పాటు చేయబోతున్న 50 పడకల ఆయూష్ ఆసుపత్రిలో అన్ని రకాల ఆయూష్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ విమలా థామస్, డిఎంహెచ్‌ఓ డాక్టర్ కాశీనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News