జెనీవా : కోవిడ్ 19 సయ్యాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అదనంగా మరో 15 కోట్ల మంది పిల్లలను పేదరికంలోకి నెట్టివేసింది. ఈ ఏడాది ఆరంభంలోనే అడుగిడిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తల్లకిందులు అయ్యాయి. పలు కుటుంబాల జీవనోపాధి దెబ్బతినడంతో ఆయా కుటుంబాల పిల్లలు పేదరికంలోకి జారుకోవల్సి వచ్చింది. యునిసెఫ్ విశ్లేషణలో ఈ బాధాకరమైన విషయం స్పష్టం అయింది. బహు ముఖపు పేదరికంతో ఇప్పుడు వందకోట్ల 20 లక్షల మందికి పైగా బాలలు జీవన్మరణ సమస్యలను ఎదుర్కొంటున్నారు. కోవిడ్ రాక తరువాత ప్రపంచంలో పేదల పరిస్థితి గురించి యునిసెఫ్ ఎప్పటికప్పుడు అధ్యయనం నిర్వహిస్తూ వస్తోంది.
ఈ క్రమంలో మరో 15 కోట్ల మంది పిల్లలకు పేదరికపు వైరస్ సోకినట్లు అయింది. ఈ పేదరికం కారణంగా వారు విద్యా, ఆరోగ్య, ఆశ్రయం, ఆహారం , పారిశుద్ధం వంటి పలు సమస్యలతో పాటు చివరికి తాగు నీరు సమస్యను కూడా ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. ఇటువంటి పలు సమస్యలు చుట్టుముట్టిన పేదబాలల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చూస్తే 15 శాతం పెరిగింది. పలు రంగాలకు సంబంధించి చితికిన పరిస్థితులు వాటితో మరింత తల్లడిల్లుతున్న పేదల పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నట్లు యునిసెఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.
కోవిడ్ కారణంగా 70కి పైగా దేశాలలో నెలకొన్న పరిస్థితులు వాటి వల్ల పేద పిల్లల దీనస్థితి గురించి విశ్లేషించారు. పిల్లలకు అత్యవసరం అయినవి సరైన ఆహారం, విద్యా అవకాశాలు, ఆరోగ్యపరిరక్షణ, నిలువనీడ వంటివి అయితే వీటిలో అనేక అంశాలపై ఈ కోవిడ్ కాలంలో తీవ్రస్థాయి ప్రభావం పడింది. ఈ విధంగా దాదాపు 45 శాతం మంది పిల్లల పరిస్థితి మరింత దిగజారింది. వచ్చే మరికొద్ది నెలల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని యునిసెఫ్ ఇప్పటికే హెచ్చరించింది. సేవ్ ది చిల్డ్రన్, యునిసెఫ్లు ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభుత్వ, పౌర సంస్థల సహకారం తీసుకుంటూ బాలలను ఆదుకునేందుకు చర్యలు తీసుకొంటోంది.