కుండుజ్(అఫ్ఘానిస్థాన్): తాలిబన్లు మంగళవారం రాత్రంతా ఎడతెరిపి లేని దాడులతో అఫ్ఘానిస్థాన్ సైనికులను, పోలీసులను కలిపి మొత్తం 20 మందిని పొట్టనపెట్టుకున్నారు. తాలిబన్ల రాజకీయ అధినేత ముల్లా బరాదర్తో 35 నిముషాలు తాను బాగా స్నేహపూర్వకంగా మాట్లాడానని తాలిబన్లు కాల్పులు విరమించాలని, ఆపించాలని కోరుకుంటున్నారని మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్లో ప్రకటించిన కొన్ని గంటలకే ట్రంప్ పిలుపును బేఖాతరు చేస్తూ ఈ దాడులు జరగడం గమనార్హం. దోహాలో తాలిబన్లకు, అమెరికాకు శనివారం కుదిరిన శాంతి ఒప్పందం పక్కనపెట్టి మళ్లీ మిలిటెంట్లు దాడులు చేయడం ప్రారంభించారు. కుండుజ్ జిల్లా ఇమామ్ సాహిబ్ లోని మూడు ఆర్మీ స్థావరాలపై గత రాత్రి తాలిబన్లు జరిపిన దాడులకు 10 మంది సైనికులు, నలుగురు పోలీసులు మృతి చెందగా.. సెంట్రల్ యురుజ్గన్ లో దాడులకు ఆరుగురు పోలీసులు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. ఈ హింస అప్ఘాన్ శాంతి ప్రక్రియకు ఆదిలోనే విఘాతం కలిగించినట్టయింది. మార్చి 10న తాలిబన్లు, అఫ్ఘాన్ల మధ్య ఖైదీల మార్పిడి పై చర్చలు జరగవలసి ఉంది.
20 Killed after Taliban Attack in Afghanistan