ముంబయి: టాటా సన్స్ సంస్థకు చెందిన ఫిక్సెడ్ డిపాజిట్ ఖాతాను హ్యాక్ చేయడానికి ప్రయత్నించిన ఏడుగురు వ్యక్తులను మహారాష్ట్రలోని థాణె పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసేందుకు వాలీవ్లోని ఒక షాపింగ్ మాల్ పార్కింగ్ ప్రదేశంలో వేచి ఉన్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులలో ఇండస్ఇండ్ బ్యాంకు ఉద్యోగి తస్లీమ్ అన్సారీ ఉన్నాడు. టాటా సన్స్కు చెందిన ఫిక్సెడ్ డిపాజిట్ సమాచారాన్ని ఇతనే హ్యాకర్లకు అందచేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబయ్లోని ఇండస్ఇండ్ బ్యాంకు చెంబూర్ బ్రాంచ్లో టాటా సన్స్కు రూ.150 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్ ఉంది. దీన్ని మూడు విడతలుగా విత్డ్రా చేసి నాగాల్యాండ్లోని వేరే బ్యాంకు ఖాతాకు తరలించాలని హ్యాకర్లు పథకం వేశారు. ఈ డబ్బును సురక్షితంగా ఉంచేందుకు నాగాల్యాండ్లోని తమ సహచరుడికి వీరు కమీషన్ ఆశ చూపించినట్లు తెలుస్తోంది. రూ.200 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్ను కొల్లగొట్టాలన్నదే వీరి టార్గెట్గా పోలీసులు చెబుతున్నారు. టాటాసన్స్కు చెందిన రూ.150 కోట్లను కాజేయాలన్న ప్లాన్కు అదే బ్యాంకులో పనిచేస్తున్న తస్లీమ్ అన్సారీ సహకరించాడని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి ఆ ఫిక్సెడ్ డిపాజిట్కు సంబంధించిన బ్యాంకు స్టేట్ మెంట్ స్వాధీనం చేసుకున్నారు. కొల్లగొట్టిన డబ్బుతో మైక్రోఫైనాన్స్ వ్యాపారం చేయాలన్నదే వీరి ఆలోచనగా పోలీసులు చెప్పారు. కాగా, దీనిపై టాటా సన్స్ లేదా ఇండస్ఇండ్ బ్యాంకు నుంచి ఎటువంటి స్పందన ఇప్పటివరకు రాలేదు.