ముంబయి: ఓ మందుబాబు తన ఇంటి పక్కన ఉండే రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి భిక్షగాళ్ల ముఠాకు అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్న సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలోని వాసాయిలోని ఖయిరపాదాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సన్నీ యాదవ్ అనే వ్యక్తి రోజు మద్య సేవించేవాడు. తన ఇంటి పక్కన ఉండే పూనమ్ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండేవాడు. పూనమ్కు రెండు సంవత్సరాల వయుసు గల బాలుడు అంకుష్ ఉన్నాడు. అంకుష్ను ఆడిపిస్తానని పూనమ్ను అడిగి ఆ బాలుడిని యాదవ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. తను కుమారుడుతో ఎంతసేపు ఎదురు చూసిన యాదవ్ తిరిగిరాకపోవడంతో అతడి ఇంటికి పూనమ్ వెళ్లింది. యాదవ్ ఇంటికి తాళం వేయడంతో చుట్టు పక్కల వెతికింది. అతడితో పాటు బాలుడి ఆచూకీ లభించకపోవడంతో యాదవ్కు ఫోన్ చేసింది. యాదవ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తన భర్తకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. యాదవ్తో బాలుడు ఉన్నట్టు స్థానికులు చెప్పడంతో పలు పోలీస్ స్టేషన్లకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆర్పిఎఫ్ పోలీసులు ఓ వ్యక్తితో రెండేళ్ల బాలుడు లోకల్ రైళ్లో ఉన్నాడని సమాచారం ఇవ్వడంతో పోలీసులు దహిశార్ ప్రాంతానికి చేరుకొని కిడ్నాపర్ ను పట్టుకున్నారు. ఆ బాలుడిని కిడ్నాప్ చేసి తల్లిదండ్రుల నుంచి డబ్బు వసూలు చేయాలని అనుకున్నానని లేకపోతే భిక్షగాళ్ల ముఠాకు బాలుడిని అమ్ముదామనుకున్నానని పోలీసుల ఎదుట యాదవ్ ఒప్పుకున్నాడు.