నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే రైతు సంక్షేమ ప్రభుత్వంగా వర్థిల్లుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ప్రకృతి వైపరీత్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. సన్నధాన్యం కొనుగోలులో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, క్రమబద్ధీకరణతో ప్రభుత్వం సన్న ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. సిఎం కెసిఆర్ అండగా ఉన్నత కాలం రైతులకు ఎలాంటి ఇబ్బంది రాదన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలు, కులాలు వారు కలిసి మెలిసి జీవిస్తున్నారని, సిఎం కెసిఆర్ను ఇబ్బందులు గురి చేయాలని, బలహీనపరచాలని కొంతమంది చూస్తున్నారన్నారు. కెసిఆర్ లేకపోతే తెలంగాణలో అభివృద్ధి జరగదన్నారు. విద్వేషాపూరితంగా, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా కొన్ని పార్టీలు ప్రకటన చేయడం దురదృష్టకరమన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాన్ని చెడగొట్టవద్దని గుత్తా విజ్ఞప్తి చేశారు. ధరణి పోర్టల్, కొత్త రెవెన్యూ చట్టం, అద్భుతమని, రైతులకు మేలు జరుగుతుందన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజమన్నారు. అంతిమంగా ప్రజల సంక్షేమం కోసం అందరూ పాటు పడాలని సూచించారు. ప్రజాజీవతంలో ఉన్న వాళ్లు, రాజకీయ నేతలు మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడాలని, ప్రజల్లో స్ఫూర్తిని నింపేలా మాటాడాలని సూచనలు చేశారు.
అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాన్ని చెడగొట్టొద్దు: గుత్తా
- Advertisement -
- Advertisement -
- Advertisement -