Monday, April 29, 2024

అన్ని పార్టీలు రజకులకు ఐదు సీట్లు కేటాయించాలి : రజక సంఘం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో రజకులకు అన్ని రాజకీయ పార్టీలు 5 సీట్లు కేటాయించాలని తెలంగాణ గాడ్గే రజకసంఘం డిమాండ్ చేసింది. ఆదివారం కాచిగూడలోని ఓ హోటల్‌లో సంఘం సర్వసభ్యసమావేశం జరిగింది. రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో రజకులకు ఎక్కువ సీట్లు కేటాయించే రాజకీయ పార్టీకి రాష్ట్రంలోని 28 లక్షల రజక ఓటర్లు ఓట్లు వేసి గెలిపించుకుంటారని సంఘం నేతలు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు సమావేశం పలు డిమాండ్‌లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, ఆసుపత్రుల్లో ధోభీ పోస్టుల భర్తీకి వెంటనే జిఓ విడుదల చేయాలని, పీర్జాదీగూడలో రజక ఆత్మగౌరవ భవనం కోసం కేటాయించిన భూమిని అన్యాక్రాంతం కాకుండా తిరిగి రజకులకు అప్పగించాలని, వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని సంఘం డిమాండ్ చేసింది. వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించాలని, ఎస్‌సి, ఎస్‌టిల మాదిరిగా రజకులకు అట్రాసిటి చట్టాన్ని వర్తింపచేయాలని సమావేశం డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ప్రధాన కార్యదర్శి గొల్ల జనార్ధన్, కోశాధికారి కె. నిరంజన్, కన్వీనర్ నాగళ్ల యాదగిరి, నందగోపాల్, ఎన్. శంకర్, ఎ. మహేష్, ఎన్. అనిల్, ఎ. వెంకటయ్య, కె. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News