Monday, April 29, 2024

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు
1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. ఈనెల 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష నిర్వహణకు ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈనెల 28 వ తేదీ నుండి మార్చ్ 19వ తేదీ వరకు జరుగ నున్న ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.

రాష్ట్రంలో జరుగనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల సన్నద్ధత పై జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ అధికారులు, విద్యా శాఖాధికారులు, సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నేడు సాయంత్రం నిర్వహించారు. ఇంటర్ పరీక్షలపై ఇటీవల సిఎస్ శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పకడ్బంధీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇంటర్ పరీక్షలలో మొదటి, రెండవ సంవత్సరాలకు సంబంధించి సుమారు 9.80 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాలలోనికి ఉన్నతాధికారులతో సహా ఏ ఉద్యోగి కూడా సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లడం నిషేదించినట్టు సిఎస్ స్పష్టం చేశారు. పరీక్షా ప్రశ్నా పత్రాలను స్ట్రాంగ్ రూమ్‌లకు లేదా మూల్యాంకన కేంద్రాలకు తీసుకెళ్లేటప్పుడు పటిష్టమైన బందోబస్తు ఉండాలని తెలిపారు. ఏ విధమైన పరీక్షా పత్రాలు  లీక్ అవ్వకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి పలుమార్లు హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, పరీక్షా పేపర్ల తరలింపుపై జిల్లా స్థాయిలో సంబంధిత పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలలో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News