రెండు కొత్త ఉత్పత్తులను ప్రారంభం
హైదరాబాద్: ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి), బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గురువారం భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. దీంతో బ్యాంక్ ఇప్పుడు 650 శాఖలు, 1,36,000 యాక్సెస్ పాయింట్ల ద్వారా వినియోగదారులకు టర్మ్, యాన్యుటీ ఉత్పత్తులను అందించనుంది. ఈ భాగస్వామ్యంతో బలహీన వర్గాల ప్రజలు ప్రయోజనం పొందుతారని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రెండు సంస్థలు తెలిపాయి. ఈ భాగస్వామ్యం కార్యక్రమంలో పోస్ట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ వినీత్ పాండే, ఐపిపిబి ఎండి, సిఇఒ జె.వెంకటరాము, బజాజ్ అలయన్జ్ సిఇఒ తరుణ్ చుగ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ ఒప్పందంతో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుండి బజాజ్ అలియాంజ్ లైఫ్ స్మార్ట్ ప్రొటెక్ట్ గోల్, బజాజ్ అలియాంజ్ లైఫ్ గ్యారెంటీడ్ పెన్షన్ గోల్ స్కీమ్లను కొనుగోలు చేయవచ్చు. బజాజ్ అలయన్జ్ లైఫ్ స్మార్ట్ ప్రోడక్ట్ గోల్ అనేది టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్, దీంతో బీమా చేసిన వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబానికి డబ్బు వచ్చేలా, ప్రయోజనం చేకూర్చే విధంగా దీన్ని రూపొందించారు. బజాజ్ అలియాంజ్ లైఫ్ గ్యారెంటీడ్ పెన్షన్ గోల్ స్కీమ్తో పదవీ విరమణ తర్వాత స్థిరమైన, హామీతో కూడిన ఆర్థిక బరోసా ఉంటుంది. ఈ రెండు ఉత్పత్తులు పిఒఎస్ ప్లాట్ఫారమ్లో అందుబాటులో ఉంటాయి.