Sunday, April 28, 2024

కెటిఆర్ పరువు ఖరీదు రూ.100 కోట్లా?: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి కెటిఆర్ నోటీసులను లీగల్‌గానే ఎదుర్కొంటామని బిజెపి ఎంపి బండి సంజయ్ పేర్కొన్నారు. మంత్రి కెటిఆర్ లీగల్ నోటీసుపై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.  కెటిఆర్ వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారని, కెటిఆర్ పరువు ఖరీదు వంద కోట్లా? అని అడిగారు. యువత భవిష్యత్తు మూల్యమెంతో కెటిఆర్ చెప్పాలని నిలదీశారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీలో తన కుట్ర ఉందని కెటిఆర్ కూడా ఆరోపణలు చేశారని, కెటిఆర్ ఆరోపణలపై తాను ఎన్ని కోట్లకు దావా వేయాలని అడిగారు. మంత్రి కెటిఆర్‌ను బర్తరఫ్ చేసేదాకా పోరాడుతామన్నారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బండి డిమాండ్ చేశారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బిజెపి నాయకులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కె. తారక రామారావు లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. టిఎస్‌పిఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్ధేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని వీరిద్దరికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్ధాలను మాట్లాడుతున్నారన్నారని కెటిఆర్ తెలిపారు.

కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటివారి పైన అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వీరికి లేదని పేర్కొన్న కెటిఆర్, ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులను లాయర్ ద్వారా పంపించారు. ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో కెటిఆర్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పకుంటే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కొవాల్సి వస్తుందని కెటిఆర్ తన నోటీసులో పేర్కొన్న విషయం విధితమే. ఈ సందర్భంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చేసిన నిరాధార ఆరోపణలను సాక్షాలతో సహా తన నోటీసుల్లో కెటిఆర్ ప్రస్తావించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News