Monday, April 29, 2024

పేపర్ లీకేజీలో బండి సంజయ్ కుట్ర నగ్నంగా బయట పడింది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: బిఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక బిజెపి పసి పిల్లలతో క్షుద్ర రాజకీయం చేస్తోందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మెదక్ క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.
మంగళవారం బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్ర నగ్నంగా బయట పడిందని ఎద్దేవా చేశారు. బిజెపి ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందా అని దేశ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు బిజెపి సందేశం ఇవ్వదలుచుకుందని, బండి సంజయ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయినా ఎందుకు బుకాయిస్తున్నరని అడిగారు. విద్యార్థులు బిజెపి కుట్రలను గమనించాలని బిజెపికి చదువు విలువ తెలియదని, బిజెపిలో చదుకున్నోళ్లు తక్కువ అని చురకలంటించారు.

పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన కుట్రదారు అని ఆరోపణలు చేశారు. తాండూరులో లీకేజీ కి పాల్పడ్డ టీచర్ బిజెపి ఉపాధ్యాయ సంఘంలో ఉన్నారని, నిన్న అరెస్టయిన ప్రశాంత్ బిజెపిలో ఉన్నారని, ప్రశాంత్ కు బిజెపి అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మధ్యాహ్నం పేపర్ లీకేజీ జరిగిందని బీజేపీ ధర్నా చేసిందని, సాయంత్రం నిందితులను విడుదల చేయాలని మళ్లీ ఎందుకు ధర్నా చేసిందని ప్రశ్నించారు. బిజెపికి ఈ ఘటనతో సంబంధం ఉందని తేలిపోయిందని, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా, సంజయ్ ను సమర్ధించడం సిగ్గు చేటన్నారు. పట్టపగలు బిజెపి నగ్నం గా చిక్కిందని హరీష్ రావు చురకలంటించారు. జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడు, టిఎస్ పిఎస్ సి లీకేజీ లో, ఎమ్మెల్యేల కొనుగోలు లో బిజెపి కుట్రలు రెడ్ హ్యాండెడ్ గా బయట పడ్డాయని ధ్వజమెత్తారు. బండి సంజయ్ కు కొన్ని సూటి ప్రశ్నలు వేయ దలుచుకున్నానని, పదో తరగతి ప్రశ్నా పత్రం వాట్సాప్ లో ప్రచారం చేసిన ప్రశాంత్ బిజెపి కార్యకర్త కాదా అని, ప్రశాంత్ ప్రశ్న పత్రాన్ని సంజయ్ వాట్సాప్ లోకి పంపింది నిజమా కాదా అని అడిగారు.

రెండు గంటల్లో 142 సార్లు సంజయ్ తో నిందితుడు ఫోన్ లో ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. పనిగట్టుకుని ప్రశ్నాపత్రాలను మీడియా గ్రూపులకు, వెబ్సైట్ లకు బిజెపి ప్రోద్భలం తో పంపింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రశ్న పత్రం వ్యాప్తి లో సంజయ్ ప్రమేయం లేకుంటే ఆయనకు నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు దాచావని అడిగారు. రోజుకో ప్రశ్న పత్రం వాట్సాప్ లో వ్యాప్తి చేయించాలని సంజయ్ కుట్రలు చేసిన విషయం నిజం కాదా? అని హరీష్ రావు అడిగారు. సోషల్ మీడియా లో ప్రశ్న పత్రాల లీకేజీ అంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా పోస్టులు పెట్టింది బిజెపి కార్యకర్తలు కాదా? అని ప్రశ్నించారు. ప్రశ్నా పత్రాలు నిందితుడు సంజయ్ కు పంపితే తప్పేమిటని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. ప్రశ్నాపత్రం సంజయ్ కు 11.20 కి పంపానని నిందితుడు చెప్పారని, వాట్సాప్ రికార్డుల్లో కూడా ఉందని, పదో తరగతి పరీక్ష సమయం ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు ఈ మధ్యలో ఎవరు ఎవరికి షేర్ చేసినా అది నిబంధనలకు విరుద్ధమని తెలియదా? అని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News