Monday, April 29, 2024

వర్షాలకు అప్రమత్తతతో ప్రాణ నష్టం జరగకుండా చూడాలి

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ శరత్

సంగారెడ్డి బ్యూరో: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా అప్రమత్తం చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్ శరత్, ఎస్‌పి రమణకుమార్‌లు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ భారీగా కురుస్తున్న వర్షంతో జిల్లాలో కావాల్సిన వర్షపాతం కన్నా ఎక్కువ వర్షం కురిసిందన్నారు. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా వారిని సంరక్షించాలని, అత్యవసర పరిస్థితులలో సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా ట్యాంకులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. చెరువులు, కుంటలు, రోడ్స్, కల్వర్టులు, కాజ్వేస్ అలుగు పారుతున్న వాటిని మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపిడిఓ పోలీస్, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి అధికారులు గ్రామ పంచాయతీ ప్రతినిధులు కార్యదర్శులు కలిసి సంయుక్తంగా పరిశీలన చేసి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

ఇతర ట్యాంకులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అదే విధంగా సమస్యాత్మకమైన వాటిని గుర్తించి వాటి వివరాలు, చర్యల నివేదికను ఇవ్వాలన్నారు. రిజర్వాయర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని నీటి పారుదల శాఖ ఎస్‌ఈకి సూచించారు. పంట నష్టం జగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ జెడికి చెప్పారు. గ్రామ పంచాయతీల్లో , మున్సిపాల్టీల్లో అధికారులో లైన్ ఏరియాలను గుర్తించి తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని, ఏ కాలనీలో కూడా ఎక్కడ నీరు నిల్వ ఉండకూడదన్నారు.

గ్రామ పంచాయతీలు. మున్సిపల్‌లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగాలన్నారు. మురుగు కాలువలలో నీరు నిలవకుండా చూడాలని, తడిసిన గోడలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి టాంటాం వేసి వారు సురక్షతంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. వానలకు పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్న ఇండ్ల వివరాల నివేదికను ఇవ్వాలని, వారంలోగా వారికి ఇవ్వాల్సిన నష్టపరిహారాన్నీ అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విరిగిన పోల్స్, తెగిన లైన్స్, కరెంట్ స్థంభాల వద్ద కరెంట్ తీగల కింద టాన్స్‌పార్మర్ల దగ్గర ప్రజలు ఉండరాదన్నారు.

రోడ్లు, కల్వర్టుల పరిస్థితులను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా ముందుగా చర్యలు చేపట్టాలని, లో లెవల్ బ్రిడ్జిల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని సంబంధి అధికారులను కోరారు. అన్ని పిహెచ్‌సిలలో, సబ్ సెంటర్‌లలో అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, 108 అంబులెన్స్ వాహనాలను ప్రాధన్యత పరంగా ఆయా సెంటర్‌లలో ఉంచాలని డిఎంహెచ్‌ఓకు చెప్పారు. ఎస్‌పి రమణకుమార్ మాట్లాడుతూ చేపల వేటకు వెళ్లకూడదని, వెళ్లే వారిని వద్దని హెచ్చరించాలని తెలిపారు. గొర్రెలు, మేకలు, పశువులను బయటకు తీసుకు వెళ్ల వద్దని సూచించాలని ఆయా అధికారులను ఆదేశించారు.

నీటి ప్రవాహం ఉన్న రోడ్లపై దారి మూసి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు 24గంటలు అందుబాటులో ఉండి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మాధురి, వివిధ శాఖల అధికారులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News