Monday, April 29, 2024

బిజెపికి బుగులు.. అందుకే ముందస్తు: సిఎం నితీశ్

- Advertisement -
- Advertisement -

పాట్నా: బిజెపికి దేశంలో విపక్ష ఐక్యత భయం పట్టుకుందని, దీనితో లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లుతుందని బీహార్ సిఎం, జెడియూ నేత నితీశ్ కుమార్ తెలిపారు. క్రమేపీ ప్రతిపక్షాలు ఒకేతాటికి రావడంతో బిజెపికి నిద్రపట్టని స్థితి ఏర్పడిందని. దీనితో దేశంలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోందని నితీశ్ మరోమారు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. తాను ముందస్తు ఎన్నికల గురించి ఆషామాషీగా చెప్పడం లేదని, అన్నింటిని పరిగణనలోకి తీసుకునే దీని గురించి పదేపదే చెప్పడం జరుగుతోందన్నారు. బలీయ అవకాశాలు ఉన్న విషయాన్ని తాను తెలియచేస్తున్నానని అన్నారు. ఈ నెల 23వ తేదీన విపక్షాల సమావేశం పాట్నాలో జరుగనుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ఇప్పటికే ప్రతిపక్ష ఐక్యతపై తెలిసివచ్చింది. ప్రతిపక్షాలు కలిసికట్టుగా నడవడానికి అవకాశం ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్లాలని బిజెపి వ్యూహరచన సాగిస్తోందని ఆయన తెలిపారు.

ముందస్తు ఎన్నికలు కొత్తేమీ కాదని, అధికారంలో ఉన్న పార్టీ తన సౌలభ్యం కోసం ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటుందని, 2004లో ముందస్తు ఎన్నికలు జరిగాయని, అప్పుడు ఉన్న ప్రధాని వాజ్‌పేయి దీనిని ముందు వ్యతిరేకించారని గుర్తు చేశారు. ముందస్తుకు ఇప్పుడు ఛాన్స్ ఉంది. దీనిని కాదనలేం. జరుగుతాయని కూడా పూర్తిగా చెప్పలేమన్నారు. కేబినెట్ నుంచి మాజీ సిఎం జితన్ రామ్ మాంజీ కుమారుడు సంతోష్ సమన్‌ను తొలిగించి ఈ స్థానంలో ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ శాఖ మంత్రిగా పార్టీ ఎమ్మెల్యే రత్నేష్ సదా ప్రమాణస్వీకారం సందర్భంగా ఆ తరువాత నితీశ్ విలేకరులతో మాట్లాడారు. జితన్ రామ్‌కు చెందిన హిందూస్థానీ అవామ్ మోర్చా (హామ్) బిజెపి తరఫున వేగుగా పనిచేస్తోందని పేర్కొంటూ ఈ పార్టీని మహాఘట్‌బంధన్ నుంచి తొలిగించారు. ఈ క్రమంలో జితన్ కుమారుడు పదవికి రాజీనామా చేశారు. హామ్‌ను కూటమి నుంచి తొలిగించడాన్ని నితీశ్ ఈ సందర్భంగా సమర్ధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News