Sunday, April 28, 2024

అయోధ్య విమానాశ్రయానికి వాల్మీకి నామం..కేబినెట్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అయోధ్యలోని విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు , అయోధ్యధామం పేరు ఖరారు అయింది. సంబంధిత నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మంత్రిమండలి సమావేశం జరిగింది. అయోధ్య విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ డిసెంబర్ 30న ప్రారంభించారు. ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరును ఖరారు చేశారు. దీనిని అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయి హోదాకు మార్చే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపారు. ఈ విమానాశ్రయం పేరుకు తగ్గట్లుగా రామాయణ ఘట్టాల చిత్తరువులు, సాంస్కృతిక ప్రత్యేకతను తెలిపే అంశాలు ఉండేలా ఈ విమానాశ్రయంలో నెలకొని ఉంటాయి. అయోధ్య విమానాశ్రయాన్ని అంతర్జాతీయ హోదా స్థాయికి పెంచడం ద్వారా

ఈ ప్రాంతం ఆర్థిక వృద్దికి దారితీస్తుందని కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. కేబినెట్ భేటీలో మరో కీలక నిర్ణయం పృధ్వీ విజ్ఞాన్‌కు ఆమోదం తెలిపారు. ఈ పథకం రూ 4797 కోట్ల వ్యయ అంచనాలతో ఐదేళ్లు అమలులో ఉంటుంది. 2021 నుంచే ఇది వాస్తవిక రూపం దాల్చింది. 2026 వరకూ ఇది అమలులో ఉంటుంది. కేబినెట్ ఆమోద ముద్ర దక్కిన వాటిలో ఇండియా, మారిషస్ సంయుక్తంగా నానో ఉపగ్రహాల రూపకల్పన ఒప్పందం కూడా ఉంది. ఇరుదేశాల మధ్య ఇటీవలే సంబంధిత విషయంపై ఎంఒయు కుదిరింది. 2030 నాటికి భారతీయ రైల్వే నికర స్థాయిలో జీరో కార్బన్ ఉద్గారాల స్థాయికి చేరే మరో ఒప్పందానికి కూడా మంత్రి మండలి ఆమోదం లభించింది. సంబంధిత లక్ష సాధనకు భారత్, యుఎస్‌ఎయిడ్ / ఇండియా మధ్య ఎంఒయు కుదిరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News