న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) శనివారం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అవినీతి, ముడుపుల సంబంధిత కేసుకు సంబంధించి దేశ్ముఖ్పై సిబిఐ కొరడా ఝుళిపించడం మహారాష్ట్రలో రాజకీయ సంచలనం కల్గించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ మహారాష్ట్రలోని దేశ్ముఖ్, ఆయన సన్నిహితుల నివాసాలు పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరం బీర్ సింగ్ అప్పటివరకూ హోం మంత్రిగా ఉన్న దేశ్ముఖ్పై తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు చేయడం పలు మలుపులు తిరిగింది. ఇప్పుడు సిబిఐ దర్యాప్తునకు దారితీసింది. అవినీతి నిరోధక చట్టం పరిధిలోని సవరించిన సెక్షన్ 7 పరిధిలో దేశ్ముఖ్పై కేసు దాఖలు అయింది. ఈ సెక్షన్ ప్రకారం ప్రభుత్వ లేదా ప్రజా సంబంధిత సేవలలో ఉండే వారు అక్రమార్జనలకు పాల్పడితే విచారణకు వీలేర్పడుతుంది. ఇక ఐపిసి సంబంధిత నేరపూరిత కుట్ర చర్యల కిందికి వచ్చే సెక్షన్ 120 బి పరిధిని కూడా కేసులో పొందుపర్చారు. ఎఫ్ఐఆర్ ఈ నెల 21వ తేదీన నమోదు అయింది.
CBI files FIR against Anil Deshmukh