Monday, April 29, 2024

చిత్రపురి హోసింగ్ సొసైటీ పై సిబిఐ విచారణ జరిపించాలి: నారాయణ

- Advertisement -
- Advertisement -

అక్రమాల పుట్టగా మారిన చిత్రపురి హోసింగ్ సొసైటీ పై సిబిఐ విచారణ జరిపించాలి: సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ డిమాండ్

మన తెలంగాణ/హైదరాబాద్ : దాదాపు రూ.300 కోట్ల అవకతవకలు జరిగి అక్రమాల పుట్టగా మారిన చిత్రపురి హోసింగ్ సొసైటీ పై సిబిఐ విచారణ జరిపించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ డిమాండ్ చేసారు. కోఆపరేటివ్ సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సొసైటీ నిర్వహించడం, సినిమా పరిశ్రమతో సంబంధం లేనివారికి సొసైటీలో సభ్యత్వాలు కల్పించి హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్లు, విల్లాలు కేటాయించారని, సొసైటీ భూములని అక్రమంగా తాకట్టుపెట్టి నిధులను అడ్డగోలుగా వినియోగించి, కోట్లలో అడ్వాన్సుల పేరుతో ఇష్టానుసారం చెల్లించి కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. సినీ కార్మికుల ఫిర్యాదు మేరకు చిత్రపురి హౌసింగ్ సొసైటీలో అక్రమాలు తెలుసుకోవడానికి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు, సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య, ప్రముఖ సినీ దర్శకులు మద్దినేని రమేష్ బాబు లతో కలసి డా. కె. నారాయణ హైదరాబాద్, మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీను శుక్రవారం సందర్శించారు.

నిర్మాణంలో చేసిన మరియు నిర్మాణంలో ఉన్న విల్లాలను, డూప్లెక్స్ ఇళ్లను, అపార్ట్మెంట్ లను వారు పరిశీలించారు. ఈ సందర్బంగా వందలాదిమంది సినీ ఆర్టిస్టులు, కార్మికులు చిత్రపురి హోసింగ్ సొసైటీ అవకతవకలపై సిపిఐ బృందానికి ఫిర్యాదు చేసారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ ప్రత్యేకంగా లే అవుట్ పర్మిషన్ లేకుండా ఆరు రో హౌస్ లు నిర్మించటం, కోర్టు వాటిని సీజ్ చేసిన తర్వాత కూడా కోర్ట్ తీర్పులను ధిక్కరించి వాటిలో వర్క్ చేసుకోవటం నేరమని, మణికొండ మున్సిపల్ అధికారులే దీనికి కారణం అయిన వారిపై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 4.5 ఎకరాల స్థలాన్ని 22 కోట్లకు 24% వడ్డీకి తీసుకోవటం, సర్వసభ్య సమావేశం తిరస్కరించిన తర్వాత కూడా ఇరవై లక్షలు సభ్యులపై భారం వేయటం కూడా కో ఆపరేటివ్ చట్టాల అతిక్రమణే అని అయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రస్తుత కమిటీ ని రద్దు చేసి పిఐసి ఏర్పాటు చేయాలని అలాగే త్వరలో సంబంధిత మంత్రులను కలసి సమస్య పరిష్కారం దిశగా ముందడుగు వేయిస్తామని, సినీ కార్మికులకు అన్యాయం జరగకుండా చూస్తామని నారాయణ తెలిపారు.

కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ చిత్రపురిని సినిమా కార్మికుల కోసం సాధించటంలో కమ్యూనిస్ట్ ల పాత్ర కూడా ఉందని, అలాంటి చిత్రపురి లో దొంగలు దూరి ఇల్లు అక్రమంగా అమ్ముకోవటం దారుణం అని ఈ చర్యలు కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ కూర్చోదని, అక్రమాలకి కారణం అయిన వారి భరతం పడతామని హెచ్చరించారు. ఐ వి ఆర్ సి యల్ నిర్మాణ సంస్థ కి 579 కోట్ల కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కి 720 కోట్లు చిత్రపురి సభ్యులు సొసైటీ కి చెల్లిస్తే ఇంత వరకూ నిర్మాణాలు పూర్తి కాకపోవటం, ఇంకా 150 కోట్ల బాలన్స్ వర్క్ ఉండటం అంటే చిత్రపురి ని పూర్తిగా తిమింగలాలు మింగేశాయని, త్వరలో విముక్తి కలిగిస్తామని తెలుపుతూ ప్రభుత్వం పరంగా వత్తిడి చేసి చిత్రపురి సభ్యుల్లో సంతోషాలు చూసే విధంగా మీకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు పుస్తకాల నర్సింగరావు, ఒరుఘంటి యాదయ్య, పనుఘంటి పర్వతాలు, జిల్లా నేతలు సయ్యిద్ అఫ్సర్, రామస్వామి, స్థానిక నేతలు కస్తూరి శ్రీనివాస్, మన్యవాసి, సిద్దు, నర్సింహా, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News