Saturday, April 27, 2024

కృష్ణబోర్డు నివేదిక కోసం కేంద్రం ఆదేశం!

- Advertisement -
- Advertisement -

జల జగడంపై క్షేత్రస్థాయి నివేదిక పంపాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించినట్టు సమాచారం
కేంద్రం వైఖరిపై విమర్శల నేపథ్యంలో ఎపి బిజెపి శాఖ సమావేశం
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌కు వివరాలు వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్యన కృష్ణానది జలవివాదాలకు సంబంధించి తాజా పరిస్థితులపై క్షేత్ర స్థాయి నివేదిక పంపాలని కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డును అదేశించినట్టు సమాచారం. బోర్డు ఛైర్మన్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఎంపి సింగ్ ఇప్పుడిప్పుడే రెండు రాష్ట్రాల మధ్యన తలెత్తిన సమస్యలపై పరిశీలన చేస్తున్నారు. ఇటు తెలంగాణ నుంచి, అటు ఎపి నుంచి ఒక రాష్ట్రంపైన మరోక రాష్ట్రం కేంద్రానికి ఫిర్యాదులు చేస్తు న్న నేపద్యంలో కేంద్ర జల్ శక్తి శాఖపై ఒత్తడి పెరిగింది. దీంతో ఈ సమస్యను పరిష్కరిచంటంలో కేంద్రం నాన్పుడు ధోరణి అవలంబిస్తుదన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎపికి చెందిన బిజెపి శాఖ శుక్రవారం కర్నూలు కేంద్రంగా రాయలసీమ స్థాయి పార్టీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు ఎంపిలు టిజివెంకటేశ్, సిఎం రమేష్ నాయుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తదితురులు పాల్గొన్న ఈ సమావేశంలో పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతలతోపాటు, తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి, శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి తదితర ప్రధాన అంశాలు చర్చించారు. సమావేశం అనంతరం పార్టీ ఎంపిలు సమస్యలను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌కు వివరించినట్టు సమాచారం.

రెండు రాష్ట్రాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరగా తాజా పరిస్థితులపై కృష్టాబోర్డుకు నివేదిక పంపాలని ఆదేశించినట్టు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారని సీమకు చెందిన ఆపార్టి ఎంపి ఒకరు తెలిపారు. కృష్ణారివర్ బోర్డు త్రిసభ్యకమిటి సమావేశాన్ని ఇప్పటికే బోర్డు ఛైర్మన్ వాయిదా వేశారు. నీటిసంవత్సరానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల మధ్యన నీటివాటాలు కుదర్చాల్సివుంది. మరో వైపు రెండు రాష్టాలనుంచి పలు అంశాలపై ఫిర్యాదులు ఉండనే ఉన్నాయి. కృష్ణారివర్‌బోర్డు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు అంశాలను అజెండాలో చేర్చాలని బోర్డుకు లేఖరాసింది. రెండు రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, వాటిలో వాస్తవ పరిస్థితులు తదితర అంశాలపైన క్షేత్ర స్థాయిలో నివేదిక పంపాలని కేంద్రం నుంచి ఆదేశాలు బోర్డు ఛైర్మన్ ఎంపి సింగ్‌కు చేతినిండా పనికల్పిస్తున్నాయి. మరో వైపు పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించాలన్న హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యన నెలకొన్న వివాదాస్పత అంశాలకు బోర్డు ఛైర్మన్ ఏవిధమైన పరిష్కారాలు చూపుతార్న అంశంపై రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి పెరుగుతూ వస్తోంది.

Centre orders to Krishna board for water dispute report

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News