Monday, April 29, 2024

నౌకాదళం లోకి ఐఎన్‌ఎస్ మోర్ముగావ్ ప్రవేశం

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయంగా తయారు చేసిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్ మోర్ముగావ్ ’ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ ఆదివారం నౌకాదళం లోకి ప్రవేశ పెట్టారు. దీంతో భారత నౌకాదళ శక్తి సామర్థాలు మరింత పెరిగాయి. ముంబైలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ మోర్ముగావ్‌ను భారత్‌లో తయారైన అత్యంత శక్తిమంతమైన యుద్ధనౌకల్లో ఒకటిగా అభివర్ణించారు. ‘ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన యుద్ధ నౌకల్లో ఇది ఒకటి. ఇందులోని వ్యవస్థలు భవిష్యత్తు అవసరాలనూ తీర్చగలవు. మన స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థానికి ఇది నిదర్శనం. భవిష్యత్తులో ఇతర దేశాలకూ నౌకానిర్మాణాలు చేసి పెడతాం’ అని మంత్రి అన్నారు.

యుద్ధనౌక విశేషాలు….

ఈ యుద్ధనౌక పొడవు 163 మీటర్లు కాగా, వెడల్పు 17 మీటర్లు. బరువు 7400 టన్నులు. గోవా లోని చారిత్రక ఓడరేవు నగరమైన మోర్ముగావ్ పేరిట నామకరణం చేశారు. అణు, జీవ, రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ ఇది పోరాడగలదు. భారత నౌకాదళం ‘వార్‌షిప్ డిజైన్ బ్యూరో’ దేశీయంగా రూపొందించిన నాలుగు ‘విశాఖపట్నం’ క్లాస్ డెస్ట్రాయర్‌ల్లో ఇది రెండోది.

ఈ యుద్ధ నౌకను మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. నాలుగు శక్తిమంతమైన గ్యాస్ టర్బైన్లతో నడిచే ఈ యుద్ధ నౌక గంటకు 30 నాట్‌లకు పైగా వేగాన్ని అందుకోగలదు. ఇందులో అధునాతన ఆయుధాలు, సెన్సార్లు ఉన్నాయి. ఆధునిక నిఘా రాడార్‌తో పాటు ఉపరితలం నుంచి ఉపరితలం , ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులు ప్రయోగించవచ్చు. పోర్చుగీస్ పాలన నుంచి గోవా విముక్తి పొంది 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 19న ఈ యుద్ధ నౌక మొదటిసారి జలప్రవేశం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News