Monday, April 29, 2024

మోడీకి సిఎం 11 వినతులు

- Advertisement -
- Advertisement -

తుమ్మిడిహట్టి ఎత్తిపోతల నిర్మిస్తాం..నీటి వాటాపై మహారాష్ట్రను ఒప్పించండి
హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు సహకరించండి
ప్రధానికి సమర్పించిన వినతి పత్రంలో ముఖ్యమంత్రి రేవంత్

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుతో పాటు మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోడీకి సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీళ్లు అందించేందుకు కేంద్ర జలజీవన్ మిషన్ నిధులు కేటాయించాలని కోరారు. మరో 29 మంది ఐపిఎస్‌లను రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. రాష్ట్రానికి రెండు రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి 11 అంశాలపై సిఎం రేవంత్ స్వయంగా వినతిపత్రం అందజేశారు. కేంద్రంతో ఘర్షణ పడబోమని సిఎం రేవంత్ స్పష్టం చేసిన సంగతి విదితమే.

రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని బహిరంగంగా వెల్లడించిన సిఎం పలు అంశాల్లో సహకరించాలని ప్రధాని మోడీని కోరారు. ఎన్‌టిపిసిలో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, గత ప్రభుత్వం 1600 మెగా వాట్లు మాత్రమే సాధించిందని గుర్తు చేశారు. మిగిలిన 2 వేల 400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్రం సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తామని వెల్లడించారు. మరోవైపు తుమ్మిడిహట్టి ఎత్తిపోతల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామన్న సిఎం, భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేంందుకు జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీని కోరారు. హైదరాబాద్‌శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికోసం 2022-23 లోనే కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ తయారీకి రూ.3 కోట్లు మంజూరు చేసిందని, 7 వేల 700 కోట్ల అంచనా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరారు. ‘రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు జల జీవన్ మిషన్ నిధులు కేటాయించండి. సుమారు 10లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లా నీళ్లు అందటం లేదు. తెలంగాణలో పెరిగిన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లకు అనుగుణంగా ఐపిఎస్ క్యాడర్‌ను అత్యవసరంగా సమీక్షించండి. కేంద్ర హోంశాఖ 2016లో తెలంగాణకు 76 ఐపిఎస్ కేడర్ పోస్టులను మంజూరు చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి మరో 29 పోస్టులను ఇవ్వాలి.‘ అని ప్రధాని మోడీని రేవంత్ రెడ్డి కోరారు.

హైదరాబాద్‌-రామగుండం, హైదరాబాద్ -నాగ్‌పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలతో పాటు 10 టిఎంసిల కేశవపురం రిజర్వాయర్ నిర్మాణం కోసం పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్ రాష్ట్రానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. లీజు గడువు ముగిసిన శామీర్‌పేటలో 1038 ఎకరాల ఫీల్ ఫైరింగ్ రేంజ్ లీజు గడువు ముగిసినందున పునరుద్ధరించాలన్నారు. ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని ప్రధానికి వివరించారు.

‘నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం కింద కేంద్ర వాటాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 347 కోట్ల 54 లక్షల రూపాయలను వెంటనే విడుదల చేయాలి. భారత్ మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా తెలంగాణకు ప్రయోజనంగా ఉండే ఎనిమిది ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. కల్వకుర్తి-కొల్లాపూర్, గౌరెల్లి-వలిగొండ, తొర్రూర్-నెహ్రూనగర్, నెహ్రూనగర్-కొత్తగూడెం, జగిత్యాల-కరీంగర్ నాలుగులైన్లు, జడ్చర్ల-మరికల్ నాలుగు లైన్లు, మరికల్-డియసాగర్ నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలి. ఇండియా సెమీ కండకర్ల మిషన్లో భాగంగా తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి‘ అని తన వినతిపత్రంలో సిఎం రేవంత్ ప్రధాని మోడీని కోరారు.
ఎయిర్‌పోర్ట్‌లో మోడీ, రేవంత్ మధ్య సరదా సంభాషణ…
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ముగించుకొని దిల్లీ బయలుదేరిన సమయంలో జరిగిన సంఘటన ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీ, సిఎం రేవంత్ రెడ్డి మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆ సమయంలో తీసిన చిత్రం వైరలైంది. ప్రధానిని హస్తినకు సాగనంపే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, బిజెపి నేత రాములు విమానం వద్ద పిఎం గురించి వేచి ఉన్నారు. అప్పుడే విమానం ఎక్కడానికి వస్తున్న పిఎం మోడీకి వీడ్కోలు చెప్పడానికి సిఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చారు. పుష్పగుచ్చం అందుకున్న ప్రధానికి, సిఎం రేవంత్‌కు మధ్య ఏదో సరదా సంభాషణ జరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News