Monday, April 29, 2024

కేంద్రంపై మరోసారి కెసిఆర్ దండయాత్ర

- Advertisement -
- Advertisement -

CM KCR fight on Modi govt over Paddy

ధాన్యం కొనుగోళ్లపై 21న ఢిల్లీ పర్యటన
రేపు టిఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంపై మరోసారి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై మోడీ సర్కార్‌తో ఢీ కొట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 21వ తేదీన మంత్రులు, పలువురు ఉన్నతాధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయనున్నారు. ఈ డిమాండ్‌కు కేంద్రం తలవంచని పక్షంలో అవసరమైతే గల్లీ నుంచి ఢిల్లీకి సెగ తగలే విధంగా రాష్ట్రంలో ఉధృతంగా ఆందోళనలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాలకు అనుగుణంగా లోక్‌సభలోనూ, రాజ్యసభలనూ టిఆర్‌ఎస్ ఎంపిలు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు.

ఈ అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎరవెల్లిలోని తన ఫాంహౌజ్‌లో శనివారం అత్యసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులను, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులను ఆహ్వానించారు. వివిధ అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వీటిపై టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల అభిప్రాయాలు, సూచనలను స్వీకరించేందుకు సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్‌ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరపాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ సమావేశానికి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, జెడ్‌పి చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్‌సిఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సిఎం కెసిఆర్ వివరించారు. రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై ఈదఫా ఉధృతమైన పోరాటాలకు టిఆర్‌ఎస్ పార్టీ సిద్ధం అవుతున్నందున ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సిఎం స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News