Saturday, April 27, 2024

పొల్లుపోకుండా హైకోర్టుకు అన్నీ చెప్పండి

- Advertisement -
- Advertisement -

CM KCR Review Meeting over Coronavirus

కోర్టులో దాఖలవుతున్న పిల్స్, దానిపై కోర్టు జారీ చేసిన ఆదేశాలపై ప్రస్తావన
వైరస్ కట్టడికి చిత్తశుద్ధితో యత్నిస్తున్నా…కొందరు ఉద్దేశపూర్వకంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు
పిల్స్ కారణంగా వైద్య, ఇతర సీనియర్ అధికారులు కోర్టుల చుట్టే తిరగాల్సి వస్తోంది
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది
కరోనాపై ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు, రోగులకు అందిస్తున్న వైద్యం… ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో పూర్తి వాస్తవాలను హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. విచారణ సందర్భంగా కోర్టుకు కావాల్సిన ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని వైద్యాధికారులకు సూచించారు. హైకోర్టు అడిగిన ప్రతి వివరాన్నీ, చేస్తున్న పనిని సమగ్రంగా తెలపాలని సూచించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో కరోనా ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ ముర్తజా రిజ్వి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, వివిధ వైద్య విభాగాధిపతులు శ్రీనివాస్, రమేశ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సమీక్ష సందర్భంగా హైకోర్టులో కరోనా విషయంలో దాఖలవుతున్న పిల్స్, వాటిపై విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవడంలోనూ, పరీక్షలు-చికిత్స విషయంలోనూ ప్రభుత్వం, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం పట్ల సమావేశంలో పాల్గొన్న పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో వ్యక్తమయిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి ఓపిగ్గా విన్నారు.

అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. కరోనా విషయంలో ఎవరు పడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారన్నారు. ఇప్పటికి 87 పిల్స్‌ను హైకోర్టు స్వీకరించిందన్నారు. నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతున్నదని వ్యాఖ్యానించారు. కరోనా సోకిన వారికి వైద్యం అందించే విషయంలో క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న వైద్యాధికారులు, ఇతర సీనియర్ అధికారులు కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నదన్నారు. ఈ క్లిష్ట సమయంలో చేయాల్సిన పని వదిలి పెట్టి వారు కోర్టుకు తిరగడం, విచారణకు సిద్ధమవడంతోనే సమయమంతా సరిపోతున్నదని సిఎం పేర్కొన్నారు. దీనివల్ల వైద్యాధికారులు విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నారన్నారు. వాస్తవానికి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నదని సిఎం కెసిఆర్ అన్నారు. మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉన్నదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇంకా ఎంత మందికైనా సరే వైద్యం అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.

ప్రతి రోజు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఇంత చేసినప్పటికీ హైకోర్టు వ్యాఖ్యలు చేస్తుండడం బాధకలిగిస్తున్నదని వ్యాఖ్యానించారు. గతంలో కూడా మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని ఎవరో పిల్స్ దాఖలు చేశారన్నారు. దానికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందనేనారు. వాస్తవ పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని ఆ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసిందని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. అయినప్పటికీ హైకోర్టులో పిల్స్ దాఖలు అవుతూనే ఉన్నాయన్నారు. హైకోర్టు వాటిని స్వీకరిస్తూనే ఉందని తెలిపారు. ఏకంగా 87 పిల్స్ పై విచారణ జరపడం, వాటికి నిత్యం హాజరు కావడం, చివరికి వివిధ పనుల్లో తీరికలేకుండా ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శిని, వివిధ వైద్యశాలల సూపరింటెండెంట్లను కూడా కోర్టుకు రావాలని పిలవడం ఇబ్బందిగా ఉందన్నారు. అధికారులు, వైద్యుల విలువైన సమయం కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతున్నదన్నారు.
కాగా కొన్ని మీడియా సంస్థలు కూడా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే అభిప్రాయం కలిగించేలా వార్తలు రాస్తున్నాయని సమావేశంలో పలువురు అధికారులు సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇది ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బంది స్థైర్యం దెబ్బతీస్తున్నదని సమావేశంలో పాల్గొన్న పలువురు తమ నిరసన వ్యక్తం చేశారు.

CM KCR Review Meeting over Coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News