Monday, April 29, 2024

సమాఖ్య స్ఫూర్తికి సమాధి!

- Advertisement -
- Advertisement -

CMs Criticises BJP Govt over Constitution Implementation

భారత దేశాన్ని సమాఖ్య రాజ్యంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. కానీ కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు దేశంలో సమాఖ్య ప్రభుత్వం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రాలకూ కొన్ని అధికారాలు ఉన్నాయనే సంగతి మర్చిపోయి కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. జిఎస్‌టి దగ్గర నుంచి విద్యుత్తు వరకు ఏ చట్టం తీసుకున్నా కేంద్రం మాటే నెగ్గింది. చివరకు బియ్యం కొనుగోళ్ల విషయంలోనూ రాష్ట్రాల మాట చెల్లుబాటు కాకపోవడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. దేశంలో సమాఖ్యవాదం మాటలకే పరిమితమౌతోంది. కేంద్రం పైకి సమాఖ్య స్ఫూర్తి అంటున్నా ఆచరణలో మాత్రం విరుద్ధంగా వ్యవహరిస్తోందని కొందరు ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సమన్వయం లేకుండా పోయిందనే ఆందోళన వ్యక్తమౌతోంది.రాష్ట్రాల సమిష్టి కృషి వల్లే దేశం కరోనా మహమ్మారి నుంచి బయటపడిందని ప్రధాని నరేంద్ర మోడీ అంటుంటారు. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొన్నాయని అనే విషయం మరచిపోరాదు. భారతదేశం ఒక సమాఖ్య దేశం ఇందులో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధిలో సహకరించుకోవాలి. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధమైన బాధ్యత. ఈ స్ఫూర్తితోనే మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశ సమాఖ్య స్వరూపాన్ని తీర్చిదిద్దారు. కానీ గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వ ధోరణి భిన్నంగా ఉంటూ తెలంగాణ లాంటి నూతన రాష్ట్రాలను విభజన హక్కుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన వాటా రానీయకుండా ఉక్కిరిబిక్కిరి చేసే విధంగానూ, సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగానూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నప్పుడు, దేశాభివృద్ధిలో తగిన వాటా దక్కనప్పుడు అది దేశాభివృద్ధికే గాక, సమాఖ్య స్ఫూర్తినే ప్రమాదంలో పడేస్తుంది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
అధికారంలో లేనప్పుడు సమాఖ్య స్ఫూర్తి, కేంద్రం సహకారం, బాధ్యత గురించి మాట్లాడిన పార్టీలు, కేంద్రంలోఅధికారంలోకి రాగానే అవి కూడా పాత పాటనే పాడుతుండటం వాటి పని తీరుకు నిదర్శనం. రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే భారత్ ఒక దేశంగా అభివృద్ధి చెందుతుంది. సమాఖ్య విధానంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలనేవి అతి ప్రధానమైనవి. ఒక రకంగా ఇదే మూలస్తంభం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దృఢమైన, స్నేహపూర్వక సంబంధాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమతుల్యత ఏర్పర్చే క్రమంలోనే హక్కులు, బాధ్యతలను రాజ్యాంగం వర్గీకరించింది. హక్కులు, బాధ్యతలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాగా విభజించారు. ఉమ్మడి జాబితా ఆసరాతో కేంద్రం రాష్ట్రాల హక్కుల్లోకి చొరబడుతోందనే విమర్శలున్నాయి. ఈ మధ్యకాలంలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సంస్కరణ బిల్లులు. ఇలాంటి చట్టాలు రాష్ట్రాలకు ముఖ్యంగా రాజకీయంగా ప్రబల శక్తిగా లేని రాష్ట్రాలకు శరాఘాతాలుగా మారుతున్నాయి. దీని వల్లే చాలా సందర్భాల్లో రాష్ట్రాల హక్కులకు భంగం కలిగినప్పుడల్లా ఫెడరల్ నినాదం ముందుకొస్తోంది.
భారతదేశ అస్తిత్వం దానికదిగా ప్రత్యేకమైనది కాదు. ఇది రాష్ట్రాలతో కూడినదే కాకుండా రాష్ట్రాల నుంచి వచ్చే పన్నులపై ఆధారపడినది. ఇదంతా రాజ్యాంగబద్ధంగా నిర్వచించుకున్నది. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు మిగతా రాష్ట్రాలు కేంద్రానికి ఇస్తున్న పన్నుల నిధులను వెచ్చించటం కాకూడదు. రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న పన్నుల నుంచి ఆ రాష్ట్రాలకు వాటాగా దక్కాల్సిన నిధులను ఇవ్వకుండా కొన్ని రాష్ట్రాలకే వెచ్చిస్తున్న పరిస్థితి ఉంటున్నది.
ఇది ఆమోదయోగ్యం కాదు. దీంతో కొన్ని రాష్ట్రాల్లో నిధుల కొరతతో అభివృద్ధి కుంటుపడటమే కాదు, ఆ రాష్ట్రాలు వెనకబడిపోయే ప్రమాదం ఉన్నది. పెరుగు, పనీర్, తేనె వంటి వాటిపైనా జిఎస్‌టి విధించటాన్ని ఆర్థిక మంత్రి సమర్థించుకుంటూ రాష్ట్రాలు కూడా భాగస్వాములుగా ఉండే జిఎస్‌టి మండలి ఈ నిర్ణయం తీసుకున్నదని అన్నారు. జిఎస్‌టి మండలి నిర్ణయాలన్నీ కేంద్రం, బిజెపి రాష్ట్రాలు కూడబలుక్కొని ఏకపక్షంగా తీసుకుంటున్నాయని, తమ అభిప్రాయానికి ప్రాధాన్యతే ఉండటం లేదని పలు విపక్ష పాలిత రాష్ట్రాలు వాపోతున్నాయి. పెరిగిన ధరలు సామాన్యులను ఎంతలా బాధపెడుతున్నాయో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరేళ్ల బాలిక ప్రధాని మోడీకి రాసిన లేఖ వెల్లడిస్తుంది. దేశంలో కోట్లాది మంది నిరుపేద కూలీలకు అంతో ఇంతో ఆసరా కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయింపులను 25 శాతం తగ్గించటమే ఇందుకు నిదర్శనం.
ఉపాధి హామీ కింద ఇవ్వాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయటం లేదని, రాష్ట్రాలను సమన్వయం చేసుకొని వెళ్లటం లేదని కేంద్ర గ్రామీణా భివృద్ధి శాఖను పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవలే తీవ్రంగా ఆక్షేపించింది. ఈ పరిస్థితి చూస్తుంటే మొత్తం పథకానికే ఎసరు పెట్టే ఆలోచనలో సర్కార్ ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని చేయాల్సిన చట్టాలను కూడా ఏకపక్షంగా తెస్తుండటంతో సమస్య ముదురుతోంది. రాష్ట్రాలకు నేరుగా సంబంధం ఉన్న రంగాల్లో అయినా ఆయా ప్రభుత్వాల సూచనలు తీసుకోవాలి. కానీ అది కూడా జరగకపోవడం తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ఆఖరికి బియ్యం కొనుగోళ్లు కూడా కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన వచ్చిన పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. దేశం సమాఖ్య స్ఫూర్తితో నడుస్తుందా, ఇటీవలి కాలంలో ఈ ప్రశ్న తరచుగా తెరపైకి వస్తోంది. విపక్ష పాలిత రాష్ట్రాలపై అప్రకటిత వివక్ష చూపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 2014 సార్వత్రక ఎన్నికలలో బిజెపి గెలవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత సమాఖ్య విధానానికి మళ్లీ ముప్పు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన విధానాలను, ముఖ్య చట్టాలను వాటిని అమలు పర్చవలసిన రాష్ట్రాలను సంప్రదించకుండా రూపొందిస్తున్నారు. కేంద్రం ఇటీవల ఉపసంహరించుకున్న మూడు సాగు చట్టాలే ఇందుకొక ఉదాహరణ.
అలాగే విద్య, సహకార సంఘాలు, బ్యాంకింగ్ మొదలైన వాటికి సంబంధించిన నిర్ణయాలను కూడా కేంద్రమే స్వయంగా తీసుకుని వాటిని రాష్ట్రాలపై రుద్దుతోంది. శాంతిభద్రతలు. ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అయినప్పటికీ కేంద్రం ఈ విషయం లో రాష్ట్ర ప్రభుత్వాల స్వతంత్ర ప్రతిపత్తిని బలహీనపరిచింది. రాజకీయ అసమ్మతిని అణచివేసేందుకు ఊపాను విచక్షణారహితంగా ప్రయోగించింది. జాతీ య దర్యాప్తు సంస్థకు విస్తృత అధికారాలు కల్పించింది. తమను వ్యతిరేకిస్తున్న రాజకీయ పక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరిచేందుకు సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మొదలైన దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటుందని ఆరోపణలున్నాయి. తమను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై ఒక పద్ధతి ప్రకారం దాడి చేయడానికే ఆలిండియా సివిల్ సర్వీస్ రూల్స్ సవరణకు పూనుకున్నారు అంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్ష్యపూరిత వ్యవస్థను అర్ధం చేసుకోవచ్చు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపట్ల వివక్ష చూపిస్తూ సమాఖ్య రాజ్యం అన్న భావనను బలహీనపరుస్తోంది.

CMs Criticises BJP Govt over Constitution Implementation

జటావత్ హనము, 851983 6308

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News