Monday, April 29, 2024

మోడీ ఇంకెన్నాళ్లీ దోపిడీ

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా పెట్రో రేట్లు తగ్గించరా?

రూ.26లక్షల కోట్లు జనం నుంచి పిండుకున్నారు ఆ మొత్తాన్ని
బడాబాబుల రుణమాఫీకి ఉపయోగించారు ప్రధాని ప్రేమంత కార్పొరేట్
సంస్థలపైనే సవరించి మరీ ఎక్సైజ్ సుంకాన్ని
పెంచిన కేంద్రం సెస్‌ల పేరుతో ఖజానా నింపుకుంటున్న మోడీ
ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా కేంద్రంపై మంత్రి కెటిఆర్ నిప్పులు

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం తన అసమర్థ విధానాలు, పరిపాలనతో దేశ ప్రజలను దోచుకుతింటోందని ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నే పథ్యంలో కేంద్రం పెట్రోపై పన్ను భారాన్ని కొంత మేరకైనా తగ్గించి దేశ ప్రజలకు విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు వంద డాలర్లకు కన్నా దిగువకు చేరుకున్నాయన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆమేరకు పెట్రో భారాన్ని ప్రజలపై తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం శోచనీయమని విమర్శించారు. పెట్రో ధరల పెరుగుదలకు అంతర్జాతీయ ముడిచమురు ధరలు కారణమంటూ కేంద్రం చేస్తున్న వాదనలో డొల్లతనం ఇప్పుడు మరోసారి బయటపడిందని కెటిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్యారెల్ ముడి చమురు ధర భారీగా తగ్గుతూనే వచ్చిందన్నారు. కాని ఘనమైన మోడీ పాలనలో దేశంలో పెట్రో రేట్లు మాత్రం పెరుగుతూ పోయాయన్నారు. రేట్లు పెంచిన ప్రతిసారి అంతర్జాతీయ ముడి చమురు ధరలను బూచీగా చూపడం మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డా రు.

అంతర్జాతీయంగా బ్యారెల్ ముడిచమురు ధర తగ్గితే ఆ ప్రయోజనం ఎక్కడ దేశ ప్రజలకు ఇవ్వా ల్సి వస్తుందన్న కుటిల ఆలోచనతోనే మోడీ ప్రభు త్వం ఎక్సైజ్ సుంకాలను, సెస్సులను భారీగా పెం చుతోందన్నారు. నుంచి ఇప్పటిదాకా పెంచడమే తప్ప తగ్గించడం తెలియదన్నట్టుగా పెట్రో ధరలను మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభు త్వం పలుమార్లు పెంచిందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కెటిఆర్ పేర్కొన్నారు. మోడీ ప్రభు త్వం కార్పోరేట్ల పాదసేవ చేస్తూ, జాతి సంపదను అప్పనంగా వారికి కట్టబెడుతోందన్నారు. దేశంలోని ఒక్కో వ్యవస్థను కబళిస్తూ మోడీ సర్కార్ జనాలను పీక్కుతింటున్నదని కెటిఆర్ మండిపడ్డారు. ఇప్పటివరకు పెట్రో పన్నులు, సెస్సుల రూ పంలో రూ. 26 లక్షల కోట్లకు పైగా జనం జేబుల నుంచి దౌర్జన్యంగా మోడీ ప్రభుత్వం దోచుకున్నదని ఆయన ఆరోపించారు. మరోవైపు బ్యాంకుల నుంచి కార్పొరేట్ బడాబాబులు తీసుకున్న రుణాలను మాఫీ చేయడానికి ఆ మొత్తాన్ని ఉపయోగిస్తున్నదన్నారు. మోడీ ప్రేమంతా కార్పోరేట్ కంపెనీలపైననే కానీ, కాయ కష్టం చేసుకునే దిగువ, మద్యతరగతి వారిపై కాదన్నారు. పెట్రో రేట్ల పెరుగుదల అనాటి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని అధికారంలోకి రాకముందు గొంతు చించుకున్న నరేంద్రమోడీ, ఇప్పుడు ధరల పెరుగుదలను ఆపడంలో ఘోరంగా విఫలం అయ్యారని ఆయన ఒప్పుకుంటారా? అని ఈ సందర్భంగా కెటిఆర్ ప్రశ్నించారు.

ముడి చమురు ధరలు తగ్గినా….రేట్లను తగ్గించని కేంద్రం

2014లో మోడీ సర్కారు ఏర్పాటైనప్పుడు బ్యారెల్ ముడిచమురు ధర దాదాపు 110 డాలర్లుగా ఉండేదన్నారు. 2015 జనవరి నాటికి అది 50 డాలర్లకు పడిపోగా…. 2016 జనవరిలో అయితే 27 డాలర్లకు పడిపోయిందన్నారు. ఇక 2020లో కరోనా లాక్‌డౌన్ అప్పుడు బ్యారెట్ ముడిచమురు ధర ఏకంగా 11 డాలర్లకు సైతం పడిపోయిందన్నారు. కానీ దేశంలో మాత్రం మోడీ ప్రభుత్వం ఏనాడు పెట్రో ధరలను అమేరకు తగ్గించిన పాపాన పోలేదని కెటిఆర్ విమర్శించారు. కేంద్ర సంస్థల గణాంకాల ప్రకారం అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లు 2014 మే నుంచి 2017 సెప్టెంబరు మధ్యనే పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ 54 శాతం పెరిగితే, డీజిల్ మీద ఏకంగా 154 శాతం పెరిగిందన్నారు.

బరి తెగించిన కేంద్రం

పెట్రో ధరలను పెంచి ప్రజల నుంచి భారీగా ఆదాయాన్ని గుంజిన మోడీ సర్కార్, దాన్ని మరింత పెంచుకునేందుకు బరితెగించిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. పెట్రోల్, డిజీల్ పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని గరిష్టంగా పెంచుకోవడానికి వీలుగా 2020 మార్చిలో కేంద్రం చట్ట సవరణ సైతం చేసిందన్నారు. ప్రజలపై భారం వేసేందుకు చట్టాన్ని సైతం సవరించిన ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీదని కెటిఆర్ మండిపడ్డారు. కోవిడ్ మహమ్మారితో ఒక వైపు దేశ ప్రజలు ఆర్థికంగా చితికిపోయి ఉన్న సమయంలో కనీస కనికరం లేకుండా మోడీ సర్కార్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకుంటూ పోయిందన్నారు. ఒక అంచనా ప్రకారం 2020 నాటికే మోడీ సర్కారు ఒక్క ఎక్సైజ్ డ్యూటీ రూపంలోనే సుమారు రూ. 14 లక్షల కోట్లను ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసిందన్నారు. సెస్సులు, పన్నుల రూపంలో ఇప్పటిదాకా మెత్తం రూ. 26 లక్షల కోట్లను ప్రజల నుంచి గుంజిన దగాకోరు ప్రభుత్వం మోడిదన్నారు.

సెస్సుల పేరుతో దొడ్డిదారిన ఖజానా నింపుకున్న కేంద్రం

కేంద్రం పెంచిన ఎక్సైజ్ డ్యూటీ నుంచి రాష్ట్రాలకు వచ్చేదే చాలా తక్కువ అని కెటిఆర్ అన్నారు. రాష్ట్రాలు ఆర్థికంగా బలహీనపడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న మోడీ సర్కార్, పన్నుల రూపంలో కాకుండా సెస్సుల రూపంలోనే ఎక్కువగా పెట్రో రేట్లను పెంచిందన్నారు. సెస్సుల రూపంలో ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తూ మోడీ సర్కార్ తన ఖజానాను దొడ్డిదారిన నింపుకుంటుందని కెటిఆర్ ఆరోపించారు. కేంద్ర సెస్సులు కాకుండా విధించిన ఒక్క పెట్రో సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తే…. ప్రతి లీటర్ పైనా ప్రజలకు దాదాపుగా 30 రూపాయల వరకు ఉపశమనం లభిస్తుందని కెటిఆర్ అన్నారు.

దేశం చరిత్రలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదు

పెట్రో రేట్లు పెరిగితే ఆటోమెటిక్‌గా రవాణా ఖర్చులు కూడా పెరుగుతున్నాయన్నారు. అడ్డూ అదుపు లేకుండా మోడీ సర్కార్ పెంచిన పెట్రో రేట్లతో నిత్యావసరాల ధరలు పెరిగి దేశ చరిత్రలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా పేదోడు దేనిని కొనలేకపోతున్నాడన్నారు. మధ్యతరగతి వర్గాల బడ్జెట్ తలకిందులైందన్నారు. ఈ పరిస్థితులతో పేద, మధ్యతరగతి వర్గాల పరిస్దితులు పూర్తిగా దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ తెలిసి కూడా ప్రజల పట్ల కనికరం లేకుండా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కేంద్రం నయవంచనకు పరాకాష్ట

సెస్సులు, సుంకాల పేరుతో దోపిడీ చేస్తునే….ఆ నెపాన్ని రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా పెట్రోల్ పైన ఒక్క రూపాయి అదనపు పన్ను వేయని తెలంగాణ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెడుతోందని కెటిఆర్ విమర్శించారు. పేదల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నదని, ఇది నయవంచనకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ముడి చమురు బ్యారల్ ధర 95 డాలర్లకు తగ్గినా, పెట్రో రేట్లను కేంద్రం ఎందుకు తగ్గించడం లేదని కెటిఆర్ ప్రశ్నించారు. ప్రస్తుతం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భరమైన ద్రవ్యోల్బణ పరిస్థితులు, కరోనా, లాక్ డౌన్, కేంద్ర ప్రభుత్వ వైపళ్యం కారణంగా పెద్దఎత్తున ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన ఉన్న అన్ని రకాల సెస్సులను రద్దు చేసి పెట్రో ధరలను తగ్గించాలని ఆ సందర్భంగా కెటిఆర్ డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News