Monday, April 29, 2024

బిఆర్‌ఎస్ మేనిఫెస్టోతో కాంగ్రెస్, బిజెపిల్లో గుబులు

- Advertisement -
- Advertisement -

పేదల అభ్యున్నతికి బాటలు వేసేలా బిఆర్‌ఎస్ మేనిఫెస్టో
కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు
ఆత్మహత్యలకు కారణమే కాంగ్రెస్
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?
రాష్ట్ర విభజన హామీలు అమలు ఏది?
గత పదేళ్లలో తెలంగాణకు బిజెపి చేసిందేమీ లేదు
ఒక్క సీటులో కూడా బిజెపికి డిపాజిట్ రాదు
బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోను చూసి కాంగ్రెస్, బిజెపి పార్టీల్లో గుబులు మొదలైందని, ఆ పార్టీలకు మైండ్ బ్లాంక్ అయిందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అందుకే ఆ రెండు పార్టీల నేతలు అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లని, అబద్దాలు చెప్పడంలో బిజెపి ఆరితేరిందని విమర్శించారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా తమ పార్టీ మేనిఫెస్టో ఉందని అన్నారు. అన్ని వర్గాలకు మరింత అభ్యున్నతి కలిగేలా ఉందని తెలిపారు. ఇటువంటి మెనిఫోస్టో కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. కెసిఆర్ ఇన్ని రకాల హామీలను ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు భావించలేదని చెప్పారు. బిఆర్‌ఎస్ మేనిఫెస్టోను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిత్తుకాగితంతో పోల్చడం పట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తుకాగితం కాంగ్రెస్ పార్టీదా తమ పార్టీదా అని ఎన్నికల్లో ప్రజలు తేల్చుతారని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న పార్టీ అన్ని లెక్కలు తీసుకొని సహేతుకంగా ప్రకటించిన మేనిఫెస్టోను చిత్తుకాగితమంటే… ఎటువంటి బాధ్యత, తాడూ బొంగరం లేని కాంగ్రెస్ చెప్పే మాటలు ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. కర్నాటకలో హామీలు అమలు చేయలేమని అక్కడి మంత్రలే ప్రకటిస్తున్న ఉదంతాలను చూస్తున్నామని, కాంగ్రెస్ గ్యారెంటీలే టిష్యూ పేపర్లని విమర్శించారు.

అమరజ్యోతి వద్ద రాహుల్ గాంధీని నివాళులర్పించమని చెప్పండి
అంశాలవారీగా మాట్లాడకుండా అమరవీరుల స్థూపం వద్దకు రండి… ప్రమాణం చేయండని సవాలు చేయడం రేవంత్ రెడ్డి స్థాయికి తగదని కవిత వ్యాఖ్యానించారు. అనేక మంది అమరులయ్యారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అని పేర్కొన్నారు. నిజంగా దమ్మూ ధైర్యం ఉంటే రాహుల్ గాంధీని అమరజ్యోతి వద్ద అమరవీరులకు నివాళులర్పించమని చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలు ఏమన్న తొలగిపోతాయో చూద్దాం అని సవాలు విసిరారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తెలంగాణ స్థితిగతులపై ఎటువంటి అవగాహన లేదని విమర్శించారు. ఏమి తెలియని స్థానిక నేతలు రాసిచ్చే స్క్రిప్ట్ ను చదవడం కాంగ్రెస్ జాతీయ నాయకులు మానుకోవాలని సూచించారు.

అబద్దాలు చెప్పడంలో బిజెపి ఆరితేరింది
అబద్ధాలు చెప్పడంలో బిజెపి పార్టీ ఆరితేరిందని ఎంఎల్‌సి కవిత పేర్కొన్నారు. రూ. 15 లక్షలు ఒక్కో ఖాతాలో వేస్తామని చెప్పి విస్మరించారని, ఏటా 2 కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బిజెపి మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణలో 2 లక్షల 21 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రైవేటు రంగంలో 30 లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించి యువతకు భరోసా కల్పించామని వివరించారు. గత పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేసిందేమీ లేదని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలు ఏమయ్యాయో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో బిజెపి 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో మొత్తం 119 సీట్లలో డిపాజిట్ కోల్పోతుందని జోస్యం చెప్పారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేసేలా బిఆర్‌ఎస్ మేనిఫెస్టో
తెలంగాణ ప్రజల కోసం సిఎం కెసిఆర్ మంచి మేనిఫెస్టోను విడుదల చేశారని కవిత తెలిపారు. ప్రగతి పథంలో దూసుకెళ్తన్న తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లేలా మేనిఫోస్టో ఉందని వ్యాఖ్యానించారు, సంపదను సృష్టిస్తూ… ఆ సృష్టించిన సంపదను పేద ప్రజలకు పంచుతూ దేశంలోనే తెలంగాణను ప్రత్యేక మోడల్‌ను సృష్టించామని స్పష్టం చేశారు. మనం సృష్టించిన మోడల్ గురించి దేశ ప్రజలు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. 2014లో రూ. లక్షా 12 వేలుగా ఉన్న తలసరి ఆదాయం ఈనాడు రూ. 3 లక్షల 15 వేలకు చేరిందంటేనే తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తుందని అన్నారు. సిఎం కెసిఆర్ అందరినీ సమానంగా చూసే వ్యక్తి కాబట్టి పారిశ్రామికవేత్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో పాడి పరిశ్రమదారులకూ అంతే ప్రాధాన్యత ఇస్తారని వివరించారు. భూమి లేని పేదలు, పేద మహిళలను అభివృద్ధి చేసేలా మేనిఫోస్టో ఉందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా మెనిఫెస్టో ఉందని చెప్పారు. తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజలు ఆమోదిస్తారన్న విశ్వాసం ఉందని ఎంఎల్‌సి కవిత ధీమా వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News