న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వేగంగా పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10-15 రోజుల తర్వాత తగ్గుముఖం పడుతుందని ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో హోం ఐసోలేషన్ విధానం అద్భుతంగా పనిచేసిందని మంగళవారం ఆయన తెలిపారు. ఇదే విధానాన్ని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, జూన్ నాటి పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగుపడిందని ఆయన అన్నారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున జరుపుతున్న కారణంగానే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని ఆయన చెప్పారు.
మార్కెట్లు, రద్దీ ప్రదేశాలు, బస్తీ దవాఖానాలు, ఆసుపత్రులు తదితర అనేక చోట్ల పరీక్షలు జరుపతున్నామని ఆయన చెప్పారు. జూన్తో పోలిస్తే పరీక్షల సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందని ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాల కన్నా తమ రాష్ట్రంలోనే పెద్ద సంఖ్యలో పరీక్షలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ఢిల్లీలో సెప్టెంబర్ 7 వరకు మొత్తం 18,03,466 మందికి పరీక్షలు జరిపామని, ప్రతి 10 లక్షల మందిలో 94,919 మందికి పరీక్షలు జరిపామని ఆయన చెప్పారు. పరీక్షలు నిర్వహించడంలో కుంటుపడితే కొత్త కేసుల సంఖ్య తగ్గవచ్చేమో కాని కరోనా వైరస్ మాత్రం మనతోనే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Corona cases will plateau in next 10-15 days