సిడ్నీ: భారత్ఆస్ట్రేలియా సిరీస్ ఆరంభానికి ముందే కరోనా మహమ్మరి కల్లోలం సృష్టిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, మరో 3 టి20లతో పాటు నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నెల చివర్లో సిరీస్కు తెరలేవనుంది. అయితే ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి ఆడిలైడ్లో జరుగనుంది. డేనైట్ పద్ధతిలో జరుగుతున్న ఈ మ్యాచ్కు ప్రేక్షకులను కూడా అనుమతిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న ఆడిలైడ్ నగరంలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ క్వారంటైన్ హోటల్లో పని చేస్తున్న సిబ్బందికి కోవిడ్19 సోకినట్టు తెలిసింది. దీంతో అతనితో కలిసి వారందరూ సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని స్థానిక ప్రభుత్వం అధికారులు సూచించారు. కాగా ఇదే హోటల్లో ఆస్ట్రేలియా టెస్టు జట్టు సభ్యులు కూడా బస చేస్తున్నారు.
వీరంతా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లి పోయారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ స్వయంగా వెల్లడించాడు. ఇదిలావుండగా ఆస్ట్రేలియా జట్టు సిబ్బందికి మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాతే దీనిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఇదిలావుండగా ఆడిలైడ్లో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది. అంతేగాక కరోనా భయం ఉన్నా సిరీస్ను యథాతథంగా నిర్వహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు స్పష్టం చేశారు. గతంతో పోల్చితే ప్రస్తుతం కరోనా తీవ్రం ఏమాత్రం ప్రమాదకరంగా లేదని వారు పేర్కొంటున్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవని వారు సూచిస్తున్నారు.
మార్పు తప్పదా
ఇదిలావుండగా కరోనా భయం నేపథ్యంలో ఆడిలైడ్ వేదికగా జరిగే తొలి టెస్టు మ్యాచ్ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆడిలైడ్కు బదులు మరో స్టేడియంలో ఆరంభ టెస్టు మ్యాచ్ను నిర్వహించినా ఆశ్చర్యం లేదు. అంతేగాక ముందు అనుకున్న ప్రకారం చారిత్రక డేనైట్ టెస్టు మ్యాచ్ను చూసేందుకు ప్రేక్షకులకు అనుమతి ఇస్తారా లేదా అనేది సందేహంగా మారింది. ఒకవైపు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు మాత్రం తొలి టెస్టు షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. కానీ కరోనా భయం వెంటాడుతుండడంతో వేదికను మార్చే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.
ఐసోలేషన్లో క్రికెటర్లు
మరోవైపు ఆడిలైడ్ క్వారంటైన్ హోటల్లో బస చేస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లందరూ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లి పోయారు. కెప్టెన్ పైన్తో సహా చాలా మంది ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారు. వీరికి మంగళవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఆటగాళ్లకు పాజిటివ్ వస్తే మాత్రం సిరీస్పై ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ అందరికి నెగెటివ్ వస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. సిరీస్ షెడ్యూల్ ప్రకారం కొనసాగడం తథ్యం. దీంతో అందరి కళ్లు ఆటగాళ్లకు నిర్వహించే కరోనా పరీక్షలపై నిలిచాయి.