మన తెలంగాణ/హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకిన సంగతి తేలింది. సెప్టెంబర్ 29న కోవిడ్19 బారిన పడిన ఆయన అప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. వెంకయ్య భార్య ఉషా నాయుడుకు కూడా కరోనా వైరస్ పరీక్ష జరపగా అప్పుడు ఆమెకు నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ ట్విట్టర్లో తెలిపింది. ఎయిమ్స్ నిర్వహించిన ఆర్టిఎఫ్పిసిఆర్ ప్రకారం ఉపాధ్యక్షుడు, అతని భార్య ఉషా నాయుడు ఇద్దరికి నెగటివ్ అని తేలింది. నాయుడు ఆరోగ్యం కుదుట పడడంతో డాక్టర్ సలహా మేరకు త్వరలో సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు.
దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పట్నించీ సామాజిక దూరం, మాస్కు వంటి నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ వస్తున్న వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్త సెప్టెంబర్ 29న ప్రసార మాధ్యమాల్లో వచ్చినప్పట్నించీ ఆయన ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలువురు పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన కోవిడ్ను ఎదుర్కొని ఆరోగ్యంగా బయటపడటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఇక తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ వెంకయ్యనాయుడు కృతజ్ఞతలు తెలిపారు.