Saturday, April 27, 2024

కంగారూ న్యాయస్థానాలు

- Advertisement -
- Advertisement -

Courts that decide punishment without trial

 

నేరం, దుర్వినియోగాలపై దోషిగా నిర్ణయించినవారిని విచారించేందుకు ప్రత్యేకంగా తగిన సాక్ష్యాధారాలు లేనపుడు కొందరు వ్యక్తులు నిర్వహించే అనధికార న్యాయస్థానం కంగారూ కోర్టని నిఘంటు అర్థం. న్యాయ ప్రమాణాలు, ప్రజల చట్టబద్ధ హక్కులు, రాజ్యాంగాన్ని కంగారూ కోర్టు పట్టించుకోదు. విచారించకనే దోషిని నిర్ధారించి, శిక్ష నిర్ణయిస్తుంది. బాధ్యతలు ఉద్దేశపూర్వకంగా మరిం చే చట్టసమ్మత కోర్టులూ కంగారూ కోర్టులే. న్యాయ వ్యవస్థ నిర్మాణ నిర్వహణలు క్షీణించినపుడు నాసిరకం తీర్పుల కంగారూ కోర్టులు తయారవుతాయి. వాదులైన వ్యక్తులపై ప్రతివాద సంస్థలు అన్యాయ, అతిశయ వ్యవస్థాగత అనుకూలతలు కలిగిన న్యాయస్థానాల్లో లభించేది కంగారూ తీర్పులే. పోటీ నిర్వహణలో తటస్థంగా ఉండాల్సిన రెఫరి తొండి టీంలో ప్రధాన ఆటగానిగా మారితే శక్తిసామర్థ్యాల ప్రతిపక్షం కూడా గెలవలేదు. న్యాయవ్యవస్థలో పాలక వర్గ ప్రమేయం ఇలాంటి స్థితినే కల్పించింది.

కంగారూ కోర్టు ఆస్ట్రేలియా పదమని కొందరు అంటారు. కానీ ఈ పదజాల మూలం 1853 నాటి అమెరికాలో ఉందని ఆక్స్‌ఫర్డ్ ఆంగ్ల నిఘంటువు పేర్కొంది. లూసియానా రాష్ట్రంలో 1841లోనే దీని ప్రస్తావన ఉంది. 1848 జనవరిలో జేమ్స్ మార్షల్ కాలిఫోర్నియాలో బంగారు కనుగొన్నాడు. కాలిఫోర్నియాలో అప్పుడు అమలులో ఉన్న మెక్సికన్ చట్టాల ప్రకారం ఖనిజాలను కనుగొన్నవారికే ఆ గనులపై అధికారం ఇవ్వబడింది. 1849లో ఈ గనుల యాజమాన్యంపై హడావిడి విచారణ జరిగింది. సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా దాటేసి ప్రతివాదుల అనుకూల తీర్పు చెప్పారు. ఇందులో ఆస్ట్రేలియా ప్రవాస గని కార్మికులు వాదులు. న్యాయం కంగారూ గంతులు వేసిందని ప్రచారం జరిగింది. ఈ కోర్టులు తమ అవసర అంశాలను వెంటనే విచారిస్తాయి. ప్రజా సమస్యలను, కంగారూ ఎగిరినట్లు, దాటేస్తాయి. కంగారూ పొట్ట సంచి లాంటి తమ జేబులో ఎవరో న్యాయ వ్యవస్థను పెట్టుకున్నారన్న అర్థంలో నేటి కోర్టులను కంగారూ కోర్టులని వ్యాఖ్యానించి ఉండవచ్చు. కంగారూ కోర్టు క్రూర హాస్య ప్రతీకలైన కాలమాజు, బూగర్ హోలెల నుండి పుట్టిందని శబ్దలక్షణ శాస్త్రజ్ఞుడు ఫీలొలోగోస్ వాదన.

కాలమాజు అమెరికా మిచిగాన్ రాష్ట్రంలో ఒక నగరం. అమెరికా ఆదివాసులు నీటి మడుగులను సులభంగా దాటడానికి అనువైన ఈ ప్రదేశంలో మొదటగా ఇల్లు కట్టుకున్నారు. వీరు ఘోర హత్యలకు గురయ్యారు. అయినా ఎవరికీ శిక్షలు పడలేదు. బూగర్ హోలె సౌత్ వర్జీనియా రాష్ట్రంలో గుర్తింపులేని తెగ. 1917లో ఈ తెగపై డజన్లకొద్దీ హత్యలు జరిగాయి. విచారణకు స్పెషల్ గ్రాండ్ జ్యూరీని నియమించారు. ఒక ఘటనపై న్యాయ విచారణ జరపాలా వద్దా అని సలహా చెప్పే న్యాయస్థానం గ్రాండ్ జ్యూరీ. ఇక్కడ న్యాయం ఎవరికి జరుగుతుందో ఊహించవచ్చు. అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లలో కంగారూ కోర్టు విస్తృత ప్రచారం పొందింది. 15-17 శతాబ్దాల మధ్య స్టార్ ఛాంబర్ పేరుతో నడిపిన ఇంగ్లీషు కోర్టులు కంగారూ కోర్టులే. ఇవి అజ్ఞాత న్యాయమూర్తులు రాజభవనంలో జరిపే రహస్య కోర్టులు. 1951లోనే అమెరికన్ జడ్జ్ విలియం డౌగ్లాస్ తన తీర్పులో ఇలా వ్యాఖ్యానించారు. పోలీసులు నిందితులను హింసించి నేరాన్ని ఒప్పించే చోట నిందితుల హక్కులు నిరాకరించబడతాయి. కంగారూ కోర్టులో కాక చట్టబద్ధ కోర్టులో విచారించబడటం నిందితుని హక్కు. గతేడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిశంసనపై విచారణ జరిగింది. పార్లమెంట్ సభ్యుడు స్టీవ్ స్కాలిస్ దీన్ని కంగారూ కోర్టని ఎగతాళి చేశాడు. ఇది విరోధాభాస న్యాయ విరుద్ధ ప్రేలాపన.

1933- 45 మధ్య జర్మనీ నియంత ప్రజా కోర్టుల పేరుతో కంగారూ కోర్టులు నడిపాడు. 20.07.1944న హిట్లర్ హత్యా ప్రయ త్న అభాండం మోపిన ప్రగతిశీల పోరాట యోధులందరికీ ఈ కోర్టులు ఉరిశిక్ష విధించాయి. మన కోరేగావ్ అరెస్టులు ఈ కోవలోవే. డిసెంబర్ 1989లో సోషలిస్ట్ రొమేనియాలో హింసాత్మక అంతర్గత ఆందోళన జరిగింది. దేశాధ్యక్షుడు, కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నికోలె క్యూసెస్కు, ఆయన భార్య ఎలేనాలకు కంగారూ కోర్టు ఉరిశిక్ష వేసింది. పాలకవర్గ, అధికారుల ప్రోత్సాహంతో జరిగే హత్యలు, అఘాయిత్యాల్లో కంగారూ కోర్టుల్లో దోషులకు శిక్షలు పడవు. దీనికి గోధ్రా, మసీదు ఉదాహరణలు. ప్రజా పక్షపాత రాజకీయ వేత్తలు, ప్రజా, కార్మిక సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, అసహాయుల కోసం పోరాడేవారు శిక్షించబడతారు. సామాజిక న్యాయం పట్టని మత పక్షపాత న్యాయరంగ వృత్తికారులు చట్టవిరుద్ధ వ్యాజ్యాలకు పాల్పడతారు. స్వయంప్రకటిత అప్రమత్త బృందాల మతోన్మాద మూకహత్యలు కంగారూ కోర్టు ప్రేరేపిత చర్యలే. భారత దేశంలో పూర్వం రాజులు సమస్యలు పరిష్కరించేవారు. తర్వాత వలసవాద శిక్షాస్మృతి ఆంగ్లేయ పక్షపాత కంగారూ కోర్టులు వచ్చాయి. ప్రాచీన హీన సంస్కృతి పంచాయతీ కంగారూ కోర్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి గోహత్యల నుండి కులాంతర వివాహాల వరకు ఏకపక్ష తీర్పులు అమలు చేస్తూనే ఉన్నాయి.

నేటి పాలకులు తమ వైదిక ఆధిపత్య తాత్వికతకు వలస వాదాన్ని జోడించారు. పశ్చిమ బంగ బీర్ భూమ్ జిల్లా సుబల్పుర్‌లో 2014 జనవరిలో 20 ఏళ్ల యువతిపై 12 మృగాలు సామూహిక అత్యాచారం చేశాయి. ఇది ఆమె శీలరాహిత్య నేరానికి గ్రామ కంగారూ కోర్టు వేసిన శిక్ష. స్త్రీలతో సహా మొత్తం గ్రామం ఈ తీర్పును సమర్థించింది. ఉత్తర భారత ఖాప్ పంచాయతీలు, దక్షిణ భారత కుల దురహంకార గుంపులు కంగారూ కోర్టులే. ఇవి ఉన్నత కులాల నేరస్థులను కొద్ది జరిమానాతో వదిలేస్తాయి. తక్కువ కులాల బాధితులను ఆర్థిక ప్రలోభాలతో తృప్తి పరుస్తాయి. మానభంగాల నిందితులను పోలీసులు చంపటం కంగారూ కోర్టు తీర్పులే. సుప్రీంకోర్టు ఉత్తర ప్రదేశ్ కంగారూ కోర్టులకు వ్యతిరేకంగా రాష్ట్ర, కేంద్ర ప్రభత్వాలను మందలించింది. తమిళనాడు, ఒడిశాలూ కంగారూ కోర్టులకు పేరు మోశాయి. చెన్నైలో న్యాయవాదులే కంగారూ కోర్టులు నడుపుతున్నారు.

పాలకులు న్యాయమూర్తులను రాజ్యాం గ పదవులతో ప్రలోభపెడతారు. కొందరిని పాత సంఘటనలతో బెదిరిస్తారు. కొందరిని వారి పాత తీర్పులతో నోర్లు మూయిస్తారు. ఫలితం కంగారూ కోర్టులు. ఇటీవలి కాలంలో అధిక శాతం తీర్పులు పాలకపక్ష అనుకూలమే. కీలక తీర్పుల్లో కూడా అసమ్మతి లేదు. పాలకవర్గ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కేసులు వెంటనే విచారణకు వచ్చాయి. కొన్ని ఆలస్యమయాయి. కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారణకే నోచుకోలేదు.

రాముని కట్టుకథతో కుర్చీ ఎక్కిన సంఘ్ పాలకులు రాజ్యాంగాన్ని చట్టపర కట్టుకథగా మార్చారు. సుప్రీంకోర్టు సంఘ్ పాలకులకు సహకరించింది. పాలకపక్షేతర మతస్థుల ఆశలు వమ్ము చేసింది. పాలకపక్ష నేరస్థులు విముక్తులయ్యారు. తాత్విక అసమ్మతీయులు ఉగ్రవాదులుగా ఉప చట్టం కింద ఉరిశిక్షకు దగ్గరయారు. పౌర సమాజం నలిపి వేయబడింది. ప్రజలను రెచ్చగొట్టి అల్లర్లు, విధ్వం సం, మానభంగాలు, హత్యలకు కారణమైన వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. పవిత్ర రాజ్యాంగం అమలు కావాలని ఆశించిన మేధావులు, ప్రగతిశీల యువకులు ఉగ్రవాదులుగా చిత్రీకరించబడి జైళ్ళలో ఉన్నారు. వీరి జీవితాలు నాశనమయ్యాయి. రాజ్యం, పాలకపక్ష మాధ్యమాలు కలిసి భారత భవిష్యత్తును హత్య చేశాయి. దేశ ప్రేమికులు మాట్లాడడానికే భయపడుతున్నారు. కంగారూ కోర్టుల్లో చట్టం తన పని తాను చేయడం లేదు. రాజ్యం సైద్ధాంతిక, భౌతిక బెదిరింపులను సాధనాలుగా వాడుకుంటోంది. రాజ్యాంగ విలువల పతన ప్రక్రియకు కంగారూ కోర్టులు కవచంగా మారాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News