Thursday, May 16, 2024

నిమిషం లోనే కరోనా ఆనవాళ్లను కనిపెట్టే పరీక్ష

- Advertisement -
- Advertisement -

వినియోగానికి సింగపూర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


సింగపూర్ : ఒక్క నిమిషం లోనే వ్యక్తి శ్వాసను విశ్లేషించి కరోనా ఆనవాళ్లను పసిగట్టే వినూత్న సాధనాన్ని సింగపూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. సింగపూర్ ప్రభుత్వం ఈ పరీక్షకు తాత్కాలికంగా అనుమతించింది. ఈ సాధనాన్ని రూపొందించిన బృందంలో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ టి. వెంకీ వెంకటేశన్ కూడా ఉన్నారు. నేషనల్ యానివర్శిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యుఎస్)కు అనుబంధ అంకుర సంస్థ బ్రీతోనిక్స్ ఈ సాధనాన్ని రూపొందించింది. ఈ సాధనానికి బ్రెఫెన్స్ గో కొవిడ్ 19 టెస్ట్ అని పేరు పెట్టారు.సింగపూర్‌లో ఒక చెక్‌పోస్టు వద్ద దీన్ని ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు.

కొవిడ్ నిర్ధారణకు ప్రస్తుతం ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేస్తున్నారు. అయితే దీని ఫలితం రావడానికి అరగంట పడుతోంది. అందువల్ల ఈ కొత్త సాధనాన్ని ఉపయోగించ వచ్చని చెబుతున్నారు. ప్రామాణిక పరీక్షగా గుర్తింపు పొందిన పిసిఆర్ ద్వారా ఫలితం రావాలంటే కొన్ని గంటలు పడుతోంది. అదేకాక దీన్ని అక్కడికక్కడే విశ్లేషించడం కుదరదు. శాంపిళ్లను ల్యాబ్‌కు పంపాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులన్నీ కొత్త సాధనం వల్ల తొలగిపోతాయి.

ఇందులో ఒక్కసారి వాడి పారేసే మౌత్ పీస్ లోకి శ్వాసను వదలాలి. ఈ మౌత్ పీస్‌కు బ్రైత్ శాంపిలర్ సంధానమై ఉంటుంది. అందులోకి వచ్చిన శ్వాస నమూనా ఆ తరువాత మాస్ స్పెక్ట్రోమీటర్ లోకి వెళ్తుంది. ఆ సాధనం, శ్వాస లోని వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీవొసి) ను విశ్లేషిస్తుంది. వాటి ఆధారంగా నిమిషం కన్నా తక్కువ సమయం లోనే ఫలితాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ఈ సాధనం ద్వారా కొవిడ్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి పిసిఆర్ పరీక్ష కోసం ముక్కు, గొంతు లోకి ఎలాంటి సాధనాలను పంపాల్సిన అవసరం లేదు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని బ్రైతోనిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News