Sunday, April 28, 2024

కడెం లోతట్టు గ్రామాలు ఖాళీ చేయించండి: సిఎస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గోదావరి నదీ పరివాహకంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. కడెం నదికి వరధ ఉథృతంగా ఉన్నందను ప్రాజెక్టుకు దిగువన ప్రజలను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందుల తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు శాంతి కుమారి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్.పి లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వెల్లడించారు. భారీ వర్షాలు, వరదల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్,డీ.ఆర్.ఎఫ్, ఫైర్ తదితర శాఖల ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే సచివాలయంలో వర్షాలు,

వరద పరిస్థితులు, సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కంట్రోల్ రూమ్ లో ప్రత్యేకంగా ముగ్గురు సీనియర్ అధికారులును నియమించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కంట్రోల్ రూమ్ లో 7997950008 , 7997959782 , 040 – 23450779 అనే నెంబర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు అదేవిధంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. కొత్తగూడెం , హైదరాబాద్ లలో రెండు చొప్పున ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, ములుగు, వరంగల్ లో ఒక్కొక్క బృందం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణా జిల్లాల్లో గత రాత్రి నుండి కొన్ని ప్రాంతాల్లో 40 సెంటీ మీటర్ల నుండి 30 సెంటి మీటర్ల వరకు వర్షం కురిసిందని తెలిపారు. భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు ఉప్పొంగడం వల్ల మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగిందని,

ఈ గ్రామంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని అన్నారు. మోరంచపల్లి గ్రామానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నామని, రక్షణ, పునరావాస చర్యలకు సహకరించేందుకు హెలికాఫ్టర్ కూడా పంపించేందు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. భూపాల పల్లి జిల్లా కలెక్టర్, ఎస్.పి లు మోరంచపల్లి గ్రామ ప్రజలతో మాట్లాడుతూ పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. అదేవిధంగా, ములుగు జిల్లా ముత్యాల ధారా జలపాతంలో చిక్కుకు పోయిన 80 మంది పర్యాటకులను రాత్రి వంటి గంట ప్రాంతంలో సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఒక రెసిడెన్షియల్ పాఠశాలలో నీరు చేరడంతో అక్కడి పిల్లలను ఇతర పాఠశాలలకు తరలిస్తున్నట్టు తెలిపారు. వరంగల్. హన్మకొండ పట్టణాలలో భారీ వర్షాల వల్ల అనేక కాలనీలు, బస్తీలు నీట మునిగాయని, ఈ బస్తీలనుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలియ చేశారు.

భద్రాచలం వద్ద గోదావరి నదీ ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రెండవ ప్రమాద సూచిక జరీ చేశామని, మూడవ ప్రమాద సూచీని ఎప్పుడైనా ప్రకటించే అవకాశమున్నందున, ముంపుకు గురయ్యే గ్రాలనుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. కడెం ప్రాజెక్ట్ ద్వారా అధిక పరిమాణంలో జలాలు విడుదల అవుతున్నందున అక్కడి పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని సి.ఎస్ వెల్లడించారు. అన్ని జిల్లాల కలెక్టర్ల, పోలీస్ కమీషనర్లు, ఎస్.పి లతో ప్రతీ గంట గంటకు పరిస్తుతులను టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నిండి మత్తడి పోస్తున్న చెరువులు, కుంటల వద్ద ప్రత్యేక చర్యలను చేపట్టామని, కాల్వలు, కాజ్ వే లాగుండా ప్రయాణం సాగించవద్దని ప్రజలకు సూచించారు. సచివాలయం నుండి వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్.ఓ.డి లు కూడా పరిస్థితులను సమీక్షిస్తున్నారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News