Monday, April 29, 2024

సైబర్ నేరాల కట్టడికి ‘సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ ఏర్పాటు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్ధ వంతంగా కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డిజిపి మహేందర్ రెడ్డి వెల్లడించారు. గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో సైబర్ సేఫ్టీ, నేషనల్ సెక్యూరిటీ అంశాలపై శనివారం నాడు ఒక రోజు జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో డిజిపి పాల్గొన్నారు. కార్యక్రమంలో సైబర్ నేరాల నిరోధంపై రూపొందించిన చైతన్య, అవగాహన పోస్టర్లను డిజిపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు, రాష్ట్రంలోని ప్రముఖ ఐ.టి సంస్థలైన ఐఐటి, ఐబిఎం సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీను అనతికాలంలో ప్రారంభిస్తున్నామన్నారు. సైబర్ నేరాల కట్టడిలో తెలంగాణ పోలీస్ కీలక పాత్ర పోషిస్తోందని ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 800లకు పైగా పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందిన పోలీస్ ఆఫీసర్లను సైబర్ వారియర్లుగా నియమించడం జరిగిందన్నారు. జిల్లా, కమిషనరేట్, రాష్ట్ర స్థాయిలోను సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ యూనిట్ లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మరో మూడేళ్ళలో దేశంలో సెల్ ఫోన్ వినియోగ దారుల సంఖ్య ఒక బిలియన్ కు చేరుకుంటుందన్నారు.

ప్రస్తుతం ప్రతీ ఒక్కరిదీ డిజిటల్ లైఫ్ అయిందని, ఇదే స్థాయిలో కూడా సైబర్ నేరాల గ్రాఫ్ కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. సైబర్ క్రైం అనేది వ్యక్తులనే కాకుండా ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య, వ్యాపార, సేవా రంగాలకు ముప్పుగా పరిణమించిందని తద్వారా దేశ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని డిజిపి పేర్కొన్నారు. ఈ సైబర్ క్రైం సవాళ్లను ఎదుర్కొనేందుకు మొత్తం పోలీస్ వ్యవస్థ నే పటిష్ట పరుస్తున్నామని, ఇందులో భాగంగా, ఇప్పటికే తెలంగాణ సైబర్ క్రైమ్ కోర్దినేషన్ సెంటర్ (టి 4 సి) ను ప్రారంభించామన్నారు. ఇది నేర నిరోధంలో కీలక పాత్ర వహిస్తోందని తెలిపారు. దేశంలోని ఆర్థిక పరమైన వ్యవహారాలన్నీ డిజిటలైజ్ చేయడంతో ఇదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు వీటిని లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. ఇటీవల నగరంలో ఒక బ్యాంక్ ద్వారా రూ.20కోట్లు తరలించిన అంశాన్ని ఉదహరిస్తూ మరో పదేళ్ళలో ఎదురయ్యే సైబర్ క్రైమ్‌లను గుర్తించి వాటి కనుగుణంగా తగు నివారణను సూచించేందుకు ఈ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ పనిచేస్తుందన్నారు. ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అధికారి పౌసమి బసు, ప్రభుత్వ హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, ఐ.టి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఐజి రాజేష్ కుమార్, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Cyber Security Centre of Excellency to set up in Hyd: DGP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News