Monday, April 29, 2024

దానంను అనర్హుడిగా ప్రకటించాలి

- Advertisement -
- Advertisement -

స్పీకర్‌కు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల ఫిర్యాదు
మేము గేట్లు ఎత్తితే మీరు భూ స్థాపితమే : పాడి కౌశిక్‌ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, బిఆర్‌ఎస్ నేతలు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామని తెలిపారు. తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ చెప్పినట్లు పేర్కొన్నారు.

ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరిన వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. మరి ఇప్పుడు బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిని రాళ్లతో కొడతారా? అని ప్రశ్నించారు. దానంను బీడీలు అమ్ముకునే వారని రేవంత్ అన్నారని.. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఉందని తెలిపారు. “రేవంత్ రెడ్డి..మీరు కొట్టారు మేం తీసుకున్నాం.. ఇక మేము కొట్టినప్పుడు మీరు లేవలేరు” అని పేర్కొన్నారు. తాము గేట్లు ఎత్తినప్పుడు మీరు భూ స్థాపితం అవుతారని రేవంత్‌ను పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని సిఎం రేవంత్‌రెడ్డిపై కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News